యాదగిరిగుట్ట, అక్టోబర్ 9 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో నిత్య సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా సాగింది. సోమవారం ఆలయ మొదటి ప్రాకార మండపంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం నిర్వహించి అగ్నిప్రతిష్ట గావించారు. అనంతరం సుదర్శన నారసింహుడి కొలుస్తూ హవనం చేపట్టారు. 100 సుదర్శన శతకాలను పఠిస్తూ ఆహుతులు జరిపారు. నారసిసంహుడికి నిత్యోత్సవాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున సుప్రభాత సేవలో నారసింహుడిని మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు. అనంతరం పంచామృతాలతో నారసింహుడికి అభిషేకం జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా జరిగాయి.
ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను గజవాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవను నిర్వహించారు. తూర్పునకు అభీష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. సాయంత్రం తిరువీధి, దర్బార్ సేవలు, రాత్రి నివేదన, శయనోత్సవ కార్యక్రమాలు జరిపి ఆలయాన్ని మూసివేశారు. సువర్ణమూర్తులకు బంగారు పుష్పాలతో పలు దఫాలుగా అర్చనలు జరిగాయి. రామలింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నరపాటు జరిపారు. సాయంత్రం రామలింగేశ్వరుడి సేవను శివాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. శివాలయం ప్రాకార మండపంలో నిత్య రుద్రహోమం నిర్వహించారు. సుమారు 9 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ. 13,23,641ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అనుబంధ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 15 నుంచి 24 వరకు దేవీ శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. 9 రోజులపాటు జరిగే ఉత్సవాల్లో పాల్గొనే దంపతులకు రూ.1,116, ఒక్కరోజు సప్తపతి పారాయణంలో పాల్గొనేందుకు రూ.116, లక్ష కుంకుమార్చనకు రూ.116 రసుము చెల్లించి పూజల్లో పాల్గొనాలని సూచించారు. ఉత్సవాల్లో భాగంగా 9 రోజులపాటు రుద్రహోమం రద్దు చేస్తున్నట్లు తెలిపారు.