యాదగిరిగుట్ట, ఏప్రిల్ 14 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల తిరువీధి, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. సుదర్శన నారసింహ హోమం పాంచరాత్రాగమశాస్త్ర రీతిలో నిర్వహించారు. ఉదయం ఆలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ సుదర్శ నారసింహ హోమం నిర్వహించారు. వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి గజవాహన సేవ నిర్వహించారు.
అనంతరం స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని వీక్షించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులకు పలు ధపాలుగా సువర్ణ పుష్పార్చనలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సాయంత్రం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా నిర్వహించే సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. ముత్తయిదువులు మంగళ హారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలోని ఊయలలో శయనింపు చేశారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలు కోలాహలంగా కొనసాగింది. స్వామివారిని సుమారు 15వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.19,33,360 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
పశ్చిమ రాజగోపురం వద్ద దశావతారమూర్తులు
స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు శ్రీమహా విష్ణువు ఎత్తిన దశావతార ప్రతిములను అద్భుతంగా తీర్చిదిద్దారు. స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చే క్రమంలో పశ్చిమ పంచతల రాజగోపురం వద్ద ఫైబర్తో అద్భుతంగా వీటిని తీర్చిదిద్దారు. ఇక్కడే భక్తులు స్వామివారిని తిలకించే విధంగా అమర్చారు. కాకతీయ పిల్లర్లు, పైన శంకు చక్ర తిరునామాలు, గరుత్మంతుడి ప్రతిమ లు, కింద స్వామివారి పవిత్ర స్తోత్రం, ఆ పక్కనే పద్మాలు, ఎనుగు తలలను తీర్చిదిద్దారు.