యాదగిరిగుట్ట, ఏప్రిల్ 5 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామి వారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. అర్చక బృందం గంటన్నర పాటు శాస్ర్తోక్తంగా కల్యాణ తంతు జరిపించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు.
స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజ వాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. అనంతరం లక్ష్మీ సమేతుడైన కల్యాణమూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్టించి నిత్య కల్యాణ తంతు జరిపించారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చనలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 17వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.20,05,714 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
శ్రీవారి సేవలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి
శ్రీవారిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సెవ్లానాయక్ ముడే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బుధవారం యాదగిరిగుట్టకు చేరుకున్న ఆయన స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయాధికారి ఊడెపు రాజు స్వామి ప్రసాదం అందించారు.