యాదగిరిగుట్ట, ఏప్రిల్ 17 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు నిత్య తిరు కల్యాణోత్సవాన్ని సోమవారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణ తంతు జరిపించారు. సుమారు గంటన్నరకు పైగా నిర్వహించిన కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద పాల్గొని వీక్షించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు.
స్వామి వారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులు సువర్ణ పుష్పార్చన పూజలు చేశారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. పాతగుట్టలో స్వామివారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు.
అనుబంధ రామలింగేశ్వర స్వామి ప్రధానాలయంలో పరమశివుడు, స్పటిక లింగేశ్వరుడికి రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 10వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.19,39,335 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. స్వామి వారిని రాష్ట్ర ఎస్బీ ఇంటలిజెన్స్ ఎస్పీ నర్సింగ్రావు సతీసమేతంగా దర్శించుకోగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. వారికి అధికారి ఊడేపు రాజు స్వామివారి ప్రసాదం అందించారు.