యాదగిరిగుట్ట, ఏప్రిల్ 11 : యాదగిరీశుడికి నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మంగళవారం ఆలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు గజవాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవను జరిపారు. గంటన్నరపాటు సాగిన కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధనలు, నిజాభిషేకం జరిపిన అర్చకులు తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన జరిపారు. సాయంత్రం స్వామివారిని గరుఢవాహనం, అమ్మవారిని తిరుచ్చీ వాహనంపై వేంచేపు చేసి సేవను కొనసాగించారు. దర్బార్ సేవలో భాగంగా ప్రధానాలయ ముఖ మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి వేంచేపు చేశారు.
ముఖమండపంలో సువర్ణమూర్తులకు బంగారు పుష్పార్చనలు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా జరిగిన సువర్ణపుష్పార్చనలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. ప్రధానాలయం, క్యూ కాంప్లెక్స్, శివాలయం చెంతన గల క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజను ఘనంగా నిర్వహించారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. స్వామికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. సుమారు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి స్వామి ఖజానాకు రూ.17,28,251 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.