యాదగిరిగుట్ట, జూలై 11: ‘నా పేరు పబ్బాల సంధ్య, మా అమ్మగారి ఊరు సికింద్రాబాద్. నాకు పళ్లై తర్వాత యాదగిరిగుట్టకు వచ్చా. 2002లో నాకు ఓటు హక్కు రాలేదు. అయితే ప్రస్తుతం జరిగే ‘సర్’ కార్యక్రమంలో భాగంగా గతంలో మా అమ్మ నాన్న, మా తాత, నాన్నమ్మలకు చెందిన ఓటరు లిస్టు కావాలని అంటున్నారు. కానీ వారి ఓట్లు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు. అప్పటి ఓటరు లిస్టు తీసుకురావాలంటే కష్టమే.’ ఇది ‘సర్’లో బీఎల్వోలకు ఎదురవుతున్న సమస్య. పెండ్లిళ్లు చేసుకుని వెళ్లిన మహిళలకు సర్ ప్రక్రియతో పాట్లు తప్పడం లేదు.
కొత్తపంచాయితీతో కోడళ్లు పరేషాన్..
సర్ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నా కోడళ్లకు కొత్త పంచాయితీని తెచ్చిపెట్టింది. 2002లో జరిగిన సర్లో ఉన్న ఓటర్ల జాబితా లభించకపోవడంతో వారి ఓటు హక్కు గల్లంతయేలా ఉందంటూ లబోదిబో మంటున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వచ్చిన మహిళలకు సమస్య మరింత ఇబ్బందిగా ఉంది. వీరికి 2002 ఓటరు లిస్టు దొరకడం లేదు. వారి తాత, అమ్మమ్మతో పాటు వారసుల లిస్టు లభ్యం కావడం లేదు. దీంతో హైదరాబాద్ నుంచి అలేరు నియోజకకర్గ ప్రాంతంలోని మండలాలకు పెండ్లిళ్లు చేసుకుని వచ్చిన మహిళలకు ఈ పరిస్థితి ఇబ్బందిగానే ఉంది.
ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాలతో పాటు వలిగొండ మండలంలోని కొన్ని గ్రామాలను కలుపుకుని 309 బూత్లకు గాను మొత్తం 2,38,040 ఓటర్లకు గాను 2,37,524 మందికి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశారు. వీటిలో 1,53,600 మంది ఫారాలను నింపి బీఎల్వోలకు అందజేశారు. ఆన్లైన్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి కాగా ఆలేరు నియోజకవర్గంలో శుక్రవారం వరకు 64.53 శాతం ఆన్లైన్ మ్యాపింగ్ జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరో 516 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదు.
వీరిలో దాదాపుగా చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయారని బీఎల్వోలు తెలిపారు. మొబైల్ ఫోన్లకు పోన్ చేసినా స్పందించడం లేదన్నారు. ఇంకా 83,924 మంది ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్వోలకు అందజేయలేదు. వీరిలో పెండ్లిళ్లు చేసుకుని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి సంఖ్యే ఎక్కువగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపుగా 60 శాతం ఓటర్లలో ఇదే పరిస్థితి ఉందనేది సమాచారం. ఇందులో ప్రధానంగా కోడళ్లుగా వచ్చినవారి సంఖ్యే అధికంగా ఉందని బీఎల్వోలను తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వచ్చిన వారి పాత ఓటరు లిస్టు లభించడం లేదన్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చి వారికి పెద్దగా సమస్య లేదని బీఎల్వోలు వెల్లడించారు.
అవగాహన లేకనే ఇబ్బందులు..
ఎన్యుమరేషన్ ఫారాలు ఏలా నింపాలో ఓటర్లకు అర్ధం కావడం లేదు. సరిగా నింపకపోతే ఓటు గల్లంతవుతుందేమోనని ఓటర్లు భయపడుతున్నారు. కొంత మంది ఫారాలను కొట్టి వేసి మళ్లీ నింపున్నారు. నిరక్షరాస్యులు మాత్రం ఆ ఫారాలను పట్టుకొని అటుఇటు తిరుగుతూ ఆందోళన చెందుతున్నారు. దీంతో బీఎల్వోలు స్వయంగా ఫారాలు నింపుతున్నారు. దీంతో బీఎల్వోలకు యాప్ నిర్వహణ భారంగా మారింది. స్మార్ట్ ఫోన్లపై అవగాహన లేని బీఎల్వోలకు సరైన శిక్షణ లేకుండా డాటా ఎంట్రీ చేయలని చెప్పడంతో ఏం చేయాలో తోచక ఇబ్బందులు పడుతున్నారు. ఓటర్ల జాబితాలో మార్పులపై జనాలు అడిగే ప్రశ్నలకు బీఎల్వోల నుంచి సమాధానం రావడం లేదు.
మండలాలవారీగా ఇలా..
బొమ్మల రామారం మండలంలో మొత్తం 29,360 మంది ఓటర్లకు గాను 29,288 మందికి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయగా వీటిలో 17,346 ఓట్లు ఆన్లైన్ మ్యాపింగ్ (71.97 శాతం)జరిగింది. తుర్కపల్లి మండలంలో 28,116 ఓటర్లకు గాను 28,112 మందికి ఫారాలు అందజేయగా వీటిలో 17,346 మందివి అన్లైన్ మ్యాపింగ్ (61.69 శాతం) జరిగింది. రాజాపేట మండలంలోని 29,805 ఓటర్లకు గాను 29,765 మందికి ఫారాలు అందజేయగా వీటిలో 21,345 మందివి ఆన్లైన్ మ్యాపింగ్ (71.62 శాతం) జరిగింది. యాదగిరిగుట్ట మండలంలో మొత్తం 40,925 ఓటర్లకు గాను 40,885 మందికి ఫారాలు అందజేయగా వీటిలో 22,193 ఓట్లు ఆన్లైన్ మ్యాపింగ్ (54.23 శాతం) జరిగింది.
ఆలేరు మండలంలో మొత్తం 34,589 ఓటర్లకుగాను 34,358 మందికి ఫారాలు అందజేయగా వీరిలో 19,980 మందివి ఆన్లైన్ మ్యాపింగ్ (57.76 శాతం) జరిగింది. మోటకొండూర్ మండలంలో మొత్తం 20,755 ఓటర్లకుగాను 20,734 మందికి ఫారాలు అందజేయగా వీటిలో 15,810 మందివి ఆన్లైన్ మ్యాపింగ్ (76.17 శాతం) జరిగింది. గుండాల మండలంలో మొత్తం 25,816 ఓటర్లకు గాను 25,813 మందికి ఫారాలు అందజేయగా వీటిలో 16,470 మందివి ఆన్లైన్ మ్యాపింగ్ (63.80 శాతం) జరిగింది. ఆత్మకూరు(ఎం) మండలంలో మొత్తం 25,743 ఓటర్లకుగాను 25,638 మందికి ఫారాలు అందజేయగా వీటిలో 17,938 మందిఆన్లైన్ మ్యాపింగ్ (69.68 శాతం) జరిగింది. వలిగొండ మండలంలో మొత్తం 2,931 ఓటర్లకుగాను 2931 మందికి ఫారాలు అందజేయగా వీటిలో 1,388 మందివి ఆన్లైన్ మ్యాపింగ్ (47.36 శాతం) పూర్తయింది.