మిర్యాలగూడ, జనవరి 10 : వాహనదారులు కొద్ది దూరమే వెళ్తున్నామని చాలా వరకు హెల్మెట్లు ధరించడం లేదని, ఈ స్వల్ప నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తుందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శనివారం మిర్యాలగూడ పట్టణంలో నో హెల్మెట్.. నో పెట్రోల్ అనే నినాదంతో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బైకర్లకు ఉచిత హెల్మెట్ల పంపిణీని సబ్ కలెక్టర్ అమిత్ నారాయణతో కలిసి అందజేసి మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులకు రక్షణ కవచం హెల్మెట్ అన్నారు. రోడ్ల పైన మనం జాగ్రత్తగా వెళ్తున్నా ఒక్కోసారి ఎదుటివారి నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయని, ఇటువంటి పరిస్థితుల్లో హెల్మెట్ ఉన్నట్లయితే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు అన్నారు. హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయడం జరుగుతుందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు అందరూ హెల్మెట్ ధరించి పోలీసు వారికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, దేశిడి శేఖర్ రెడ్డి, సిఐలు నాగభూషణ్ రావు, వెంకట నరసయ్య, పి ఎన్ డి ప్రసాద్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.