కోదాడ, డిసెంబర్ 19 : కోదాడ కోర్టు ఆవరణలో ఈ నెల 21న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన, ఇరువైపులా సమ్మతితో సమస్యలను పరిష్కరించుకునే అవకాశం అందుబాటులో ఉందన్నారు. రాజీ చేసుకునే అవకాశమున్న వివిధ రకాల క్రిమినల్, కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన కేసులు, వైవాహిక జీవితం, కుటుంబ సమస్యలకు సంబంధించిన కేసులు, డ్రంకన్ డ్రైవ్, మోటారు వాహన చట్టం ఉల్లంఘనలు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంక్ రికవరీ, విద్యుత్ చౌర్యం తదితర కేసులు పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని సూచించారు. న్యాయశాఖ అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు.