పెద్దవూర, ఫిబ్రవరి 15 : మహాశివరాత్రి, ఇద్దాసు(శివారాధన) ఆరాధనోత్సవాల్లో భాగంగా అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఇద్దాస్ ఆలయ కమిటీ చైర్మన్ షేక్ అబ్బాస్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లిలో జాతీయ స్థాయి మహిళల కబడ్డీ పోటీలు మంగళవారం రాత్రి ఫ్లడ్లైట్ల వెలుతురులో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల గ్రామం చింతపల్లిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మొత్తం 18 రాష్ర్టాల జట్లు పాల్గొంటున్న ఈ పోటీల్లో మంగళవారం రాత్రి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కేరళ, పంజాబ్, తమిళనాడు, సౌత్ సెంట్రల్ రైల్వే, పచ్చిమబెంగాల్ రాష్ర్టాల నుంచి జట్లు పాల్గొనగా ట్రయల్స్ పోటీలు నిర్వహించారు.
బుధవారం పలు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. రాత్రి పొద్దుపోయే వరకు పోటీలు కొనసాగాయి. పోటీలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుంటక వెంకట్రెడ్డి, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జి.కర్తయ్య, జిల్లా గౌరవాధ్యక్షుడు గార్లపాటి శేఖర్, సర్పంచ్ సుంకిరెడ్డి ప్రభావతీసంజీవరెడ్డి, ఉప సర్పంచ్ భారతీకొండల్, ఎంపీటీసీ జటావత్ జ్యోతీకృష్ణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవినాయక్, నాయకులు బ్రహ్మారెడ్డి, సత్యనారాయణరెడ్డి, సుంకిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
గెలుపొందిన జట్లు : బుధవారం జరిగిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్పై తెలంగాణ10 పాయింట్లతో, పంజాబ్పై ఢిల్లీ 31 పాయింట్లతో గెలుపొందాయి. అలాగే అబ్బాస్ ఎడ్యుకేషన్ సొసైటీ పెద్దవూర జట్టు పంజాబ్(చింతపల్లి)జట్టుపై 9 పాయింట్ల తేడాతో గెలుపొందగా, జమ్మూకశ్మీర్పై గుజరాత్ 49 పాయింట్లతో, ఆంధ్రప్రదేశ్పై తమిళనాడు 30 పాయింట్లతో, ఉత్తరాఖండ్పై కేరళ 9 పాయింట్లతో, హర్యానాపై కర్ణాటక 4 పాయింట్ల తేడాతో గెలుపొందాయి.