నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : మంగళవారం ఉదయం.. సమయం సరిగ్గా 11.30 గంటలు. జిల్లావ్యాప్తంగా దేశభక్తి ఉప్పొంగింది. ప్రతిచోటా, ప్రతి నోటా జాతీయ గీతం వినిపించింది. త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేయడం కనిపించింది. ముందే సిద్ధమైన వారు ఘనంగా నిర్వహించగా, అప్పటివరకూ పనుల్లో వాళ్లు నిమగ్నమైన సైతం కాసేపు పక్కన పెట్టి జనగణమన పాడారు. స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు, కార్ఖానాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, వ్యవసాయ క్షేత్రాలు, చౌరస్తాలు.. ఇలా అన్నిచోట్లా సమాఖ్య స్ఫూర్తిని చాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో జిల్లా జనమంతా జాతీయ గీతాలాపనలో పాలుపంచుకున్నది. చౌటుప్పల్లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి హాజరయ్యారు.
నల్లగొండ క్లాక్టవర్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పాల్గొన్నారు. చౌటుప్పల్ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపలి రవీందర్రావు, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, గాదరి కిశోర్కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి భాగస్వాములయ్యారు. రామన్నపేటలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, దేవరకొండలో రమావత్ రవీంద్రకుమార్ గీతాలాపన చేశారు.
దేవరకొండ బస్టాండ్ వద్ద గీతాలాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అహింసే ఆయుధం
పీఏపల్లి గాంధీ చౌరస్తాలో జాతీయ గీతాలాపనలో పాల్గొన్న ఎంపీపీ ప్రతాప్రెడ్డి, ప్రజలు
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
నీలగిరి, ఆగస్టు 16 : 75 ఏండ్ల స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకొంటున్నామని, మహనీయుల పోరాట స్ఫూర్తిని చాటేలా ముఖ్యమంత్రి కేసీఆర్ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ అందులో భాగస్వామ్యం కావాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నల్లగొండ క్లాక్టవర్ సెంటర్లో సోమవారం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపనలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించారని, ఎనిమిదేండ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు యాదవ్, డీఈఓ భిక్షపతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.