నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఎంజీయూ నుంచి జారీ చేసే వివిధ కోర్సుల సర్టిఫికెట్లకు నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ) స్కీమ్లో చోటు లభించింది. దాంతో ఇక్కడ జారీ చేసే సర్టిఫికెట్స్ను ఆన్లైన్లో లాగిన్ అయి చూసుకోవచ్చు. కొంత డిపాజిట్ చెల్లించడంతోపాటు పూర్తి వివరాలు నమోదు చేస్తేనే ఓపెన్ అవుతుంది. దీనివల్ల నకిలీ సర్టిఫికెట్స్కు ఆస్కారం లేదు. తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఎన్ఏడీలో ప్రవేశించిన తొలి విశ్వవిద్యాలయం ఎంజీయూనే. ప్రస్తుతం 2019-20, 2020-21 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్స్ను ఎన్ఏడీలో అందుబాటులో ఉంచారు. త్వరలో మిగతా మొత్తం విద్యార్థుల సర్టిఫికెట్స్ను ఎన్ఏడీలో నమోదు చేయనున్నారు. దీని మాదిరిగానే ఎంజీయూ వెబ్సైట్లో డీజీలాకర్ అనే ఫోల్టడర్ను అందుబాటులో ఉంచారు. దీనిని యూనివర్సిటీ ఇచ్చే ప్రత్యేక లాగిన్తో ఓపెన్ చేసుకోవచ్చు.
రామగిరి, ఏప్రిల్ 14 : భారత ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ స్కీమ్లో (ఎన్ఏడీ) మహాత్మాగాంధీ యూనివర్సిటీకి చోటు దక్కింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్ఏడీలో చోటు సంపాదించిన యూనివర్సిటీ ఎంజీయూ ఒక్కటే కావడం విశేషం. దాంతో విద్యార్థులకు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి.
జాతీయ స్థాయిలో ఎంజీయూ సర్టిఫికెట్లు
దేశంలోని యూనివర్సిటీలు, రాష్ట్ర, జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్స్ నుంచి వివిధ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థుల సర్టిఫికెట్లను జాతీయస్థాయిలో అమలు చేసే పనిని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ‘నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ’ (ఎన్ఏడీ), సెంట్రల్ డిపాజిటరీ లిమిటెడ్ నిర్వహిస్తాయి. ఈ సంస్థల్లో రిజిస్ట్రేషన్ అయిన యూనివర్సిటీలు విద్యార్థులకు జారీ చేసే సర్టిఫికెట్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుంది. ఇందులో ఎంజీయూకు చోటు దక్కడం వల్ల యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు ఎక్కడైనా ఉద్యోగానికి వెళ్లిన సందర్భాల్లో వారి సర్టిఫికెట్లు అసలైనవేనా అనే విషయాన్ని ఆయా సంస్థలు నిర్ధారించుకునే వీలు కలుగుతుంది. దాంతో నకిలీ సర్టిఫికెట్లకు చెక్ పడనుంది. ఎంజీయూకు జాతీయస్థాయి గుర్తింపు లభిస్తుంది.
ఎక్కడి నుంచైనా పొందే అవకాశం
ఎంజీయూ జారీ చేసే సర్టిఫికెట్స్ను ఎన్ఏడీ స్కీమ్తో జత చేస్తారు. దాంతో దేశంలో ఎక్కడి నుంచైనా విద్యార్థులు తమ సర్టిఫికెట్స్ను నేరుగా పొందడానికి, వాటిని ప్రింట్ తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇందులో లాగిన్ అయిన తర్వాత ఎన్ఏడీ అడిగిన వివరాలు, ఫీజు చెల్లిస్తే సర్టిఫికెట్స్ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. ఈ విధానంతో విద్యార్థులు సర్టిఫికెట్స్ను తమ వెంట తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎన్ఏడీలో లాగిన్ అయి పొందే సర్టిఫికెట్స్పై ప్రత్యేక కోడ్, సెక్యూరిటీ నంబర్ ఉంటుంది. దాంతో ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సర్టిఫికెట్లను ఆయా సంస్థలు సులభంగా గుర్తు పట్టడానికి అవకాశం ఉంటుంది. ఎంజీయూ 2019-20, 2020-21 విద్యా సంవత్సరంలో జారీ చేసిన సర్టిఫికెట్లు ప్రస్తుతం ఏన్ఏడీలో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే పరీక్షల విభాగం ప్రారంభించిన నాటి నుంచి జారీ చేసిన సర్టిఫికెట్లు కూడా ఎన్ఏడీలో అందుబాలులో ఉంచనున్నారు.
తెలంగాణలో మొదటి యూనివర్సిటీ
ఎన్ఏడీలో ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)చేరింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే హెచ్సీయూ మొదటసారిగా చేరింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీల్లో ఎంజీయూ ఒక్కటే ఎన్ఏడీలో చేరింది.
అందుబాటులో డీజీలాకర్…
ఎంజీయూ వెబ్సైట్లో డీజీలాకర్ అనే ఫోల్డర్ను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఇందులో లాగిన్ అయి వారికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. నిర్ణత ఫీజు చెల్లించిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత వారికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఓపెన్ అవుతాయి. వర్సిటీ ఇచ్చే ప్రత్యేక లాగిన్తో విద్యార్థులు వారి సర్టిఫికెట్స్ పొందే అవకాశాన్ని ఎంజీయూ కల్పించింది.
వర్సిటీ సేవలు విస్తృతం చేసే లక్ష్యంతోనే
మహాత్మాగాంధీ యూనివర్సిటీ అందించే సర్టిఫికెట్స్ను ఎన్ఏడీ లాగిన్లో అందుబాటులో ఉంచాం. ఎన్ఏడీతో కలసి జారీచేసే సర్టిఫికెట్స్ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఇక్కడ చదివిన విద్యార్థులు దేశంలో ఎక్కడి నుంచైనా వారికి కావాల్సిన సర్టిఫికెట్స్ పొందే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఉద్యోగం కోసం వెళ్లిన సందర్భాల్లో ఆయా సంస్థలు సర్టిఫికెట్లను వెరిఫై చేసుకునే వీలు ఉంటుంది. ఇప్పటి వరకు ఈ స్కీమ్లో చోటు దక్కించుకున్న యూనివర్సిటీల్లో తెలంగాణ నుంచి ఎంజీయూ ఒక్కటే కావడం సంతోషంగా ఉంది.
– ప్రొఫెసర్ గోపాల్రెడ్డి, వీసీ, ఎంజీయూ