రామగిరి, డిసెంబర్ 8: నల్లగొండ పట్టణానికి చెందిన స్వచ్ఛంద సేవకుడు పర్వతం అశోక్ ప్రతిష్టాత్మక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పురస్కారానికి ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని గుర్తించి, భారతీయ దళిత సాహిత్య అకాడమీ ఈ అవార్డులను అందజేస్తుంది. 2022 సంవత్సరానికి గానూ నల్లగొండ జిల్లా నుంచి అశోక్ను ఎంపిక చేసింది. సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురి మన్ననలు, అవార్డులు అందుకున్న అశోక్ అంబేద్కర్ అవార్డును ఈ నెల 11న ఢిల్లీలో అందుకోనున్నారు. ఆ మేరకు భారతీయ దళిత సాహిత్య అకాడమీ సౌత్ జోన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ జితేందర్ ఆహ్వాన లేఖను పంపారు.
ఒంటరిగా మొదలై వందల మందికి ఉపాధి
సూర్యాపేట జిల్లా గుంపులతిరుమలగిరికి చెందిన పర్వతం అశోక్ కులవృత్తిని నమ్ముకుని నల్లగొండకు వచ్చారు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో చిన్నతనంలోనే చదువుకు దూరమైనా, స్వశక్తితో కార్పెంటర్ షాపు ఏర్పాటుచేసుకుని నిలదొక్కుకున్నారు. వచ్చిన ఆదాయంలోనే కొంత సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తుండేవారు. అనాథ పిల్లలకు ఆసరాగా ఉండడం, వృద్ధులకు తోడుగా నిలవడం వంటివి చేస్తున్నారు. కొవిడ్ పరిస్థితుల్లో అన్నార్తులు, మున్సిపల్ కార్మికులు, సొంత ప్రాంతాలకు కాలినడకన వెళ్తున్న ఇతర రాష్ర్టాల కార్మికులకు నిత్యం ఫుడ్ పార్సిళ్లు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 20కిపైగా రక్తదాన శిబిరాలు నిర్వహించి ఆపదలో ఉన్న వారికి రక్తం అందేలా చూస్తున్నారు. విశ్వబ్రాహ్మణ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి జ్ఞాపకార్థం ఏటా జయంతి, వర్ధంతి రోజుల్లో పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణం లో రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి సాధారణ ఏజెంట్ నుంచి ఎదిగి ఏకంగా ఒక కంపెనీనే స్థాపించారు. మూలాలను మరువకుండా తన పని తాను చేసుకుంటూనే ఎండీగా మరో వందమందికిపైగా యువతకు ఉపాధి కల్పిస్తున్నారు.
సేవలోనే సంతృప్తి
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఉన్న సంతృప్తి ఎంత డబ్బు సంపాదించినా దొరుకదు. కష్టం విలువ తెలిసినవాడిగా ఇతరుల కష్టాలను పంచుకుంటాను. సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు వంటివి భవిష్యత్లోనూ కొనసాగిస్తాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పురస్కారానికి ఎంపిక చేయడం నా సామాజిక బాధ్యతను మరింత పెంచింది.
– పర్వతం అశోక్