సూర్యాపేట టౌన్, ఆగస్టు 5 : మెడికల్ కళాశాల, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల నూతన భవనాల నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో గురువారం ఆయన పర్యటించి నూతన భవనాల నిర్మాణాన్ని పరిశీలించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు పాలన చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటను జిల్లాగా ప్రకటించారని, ప్రత్యేకంగా మెడికల్ కళాశాలను కేటాయించారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా చేపట్టిన నిర్మాణాల్లో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమీకృత కలెక్టరేట్ భవనంతో పాటు అన్ని భవనాల నిర్మాణాల్లో నాణ్యత పాటించాలని, శరవేగంగా పూర్తి చేయాలని చెప్పారు.
సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పనులను పరిశీలించాలని కోరారు. అలసత్వం వహిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కలెక్టరేట్ భవన నిర్మాణ పనుల్లో అలసత్వం వహించిన కాంట్రాక్టర్పై చట్ట పరమైన చర్యలు చేపట్టాలని మంత్రి జగదీశ్రెడ్డి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని ఆదేశించారు. పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. జాప్యానికి కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మంత్రి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ జీడి భిక్షం, పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, మార్కెట్ మాజీ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, ఉప్పల ఆనంద్, కీసర వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు.
సోలార్ లైటింగ్ ప్రారంభం
సద్దుల చెరువు కట్టపై సుమారు రూ.74లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సోలార్ లైట్లను మంత్రి జగదీశ్రెడ్డి గురువారం సాయంత్రం ప్రారంభించారు. మున్సిపల్ సాధారణ నిధులు రూ.7లక్షల వ్యయంతో మినీ ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. అంబేద్కర్నగర్లో రూ.37లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. దురాజ్పల్లి సమీపంలో బ్రాహ్మణ సంక్షేమ భవన పనులను పరిశీలించారు.
తాగు నీటి సమస్య రావొద్దు..
సూర్యాపేట టౌన్, ఆగస్టు 5 : తాగునీటి సరఫరాలో ఎటువంటి సమస్య ఉండొద్దని.. ఎక్కడైనా ఫిర్యాదు అందితే చర్యలు తప్పవని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అధికారులను హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే స్పందించి వేగవంతంగా పరిష్కరించాలన్నారు. ఎస్ఈ సురేశ్, ఈఈలు వెంకటేశ్వర్లు, పాపయ్య, డీఈలు అభినయ్, రాజేందర్, శ్రీకాంత్, పాండు పాల్గొన్నారు.