రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు, కరెంట్, విత్తనాలు, ఎరువులు అందించడానికి, పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ప్రతియేటా ప్రభుత్వం ముందస్తుగా సాగు లెక్కలు చేపడుతుంది. ఈ వానకాలం సీజన్లో ఏ సర్వే నంబర్లో ఏ పంట వేశారు.. ఎంత సాగయ్యింది.. వంటి వివరాలను వ్యవసాయ విస్తరణాధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి సేకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు ట్యాబ్లో నమోదు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 11.93 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం 30వేల ఎకరాల్లో సాగు సర్వే పూర్తయ్యింది. ఈ సారి ప్రభుత్వం పంటల లెక్కల కోసం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చింది. అది వస్తే సర్వే నంబర్ల డైరెక్షన్లను బట్టి వివరాలు తీసుకోనున్నారు. దీన్ని ఈ సీజన్ నుంచే చేపట్టనున్నారు. ఇక పంటల ఫొటో క్యాప్చరింగ్తో సర్వే చేపట్టడానికి పైలట్ ప్రాజెక్టుగా
వేములపల్లి మండలాన్ని ఎంపిక చేశారు.
– నల్లగొండ, జూలై 30
నల్లగొండ, జూలై 30 : వానకాలంలో రైతులు సాగు చేసిన పంటల లెక్కలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వ్యవసాయ అధికారులను ఆదేశించింది. దాంతో ఆయా జిల్లాల యంత్రాంగం క్రాప్ బుకింగ్ కార్యక్రమం ప్రారంభించారు. వారం రోజులుగా నల్లగొండ జిల్లాలోని 140 వ్యవసాయ క్లస్టర్లలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఈ సీజన్లో సాగు చేసిన పంటల లెక్కలు తేల్చేందుకు సర్వే చేస్తున్నారు. ప్రతి క్లస్టర్ పరిధిలోని గ్రామాలకు ఏఈఓ వెళ్లి రైతుబంధు సమితి అధ్యక్షుల సహకారంతో క్షేత్ర స్థ్దాయిలో సర్వే చేయడంతో పాటు ట్యాబ్లో నమోదు చేస్తున్నారు. గ్రామంలో ఉన్న సర్వే నంబర్లు, ఏ సర్వే నంబర్లో ఎంత భూమి ఉంది.. అందులో సాగులో ఉన్న భూమి ఎంత.. ప్రస్తుతం ఏ మేరకు సాగు చేశారు. అనే వివరాలు సేకరిస్తూ సర్వే కొనసాగిస్తున్నారు. సర్వే వివరాలు ఎప్పటికప్పుడే ట్యాబ్లో ఎంట్రీ చేస్తుండగా.. ఆ వివరాల ఆధారంగా మండల, డివిజన్ వ్యవసాయ అధికారులు వెరిఫై చేస్తున్నారు.
ఈ వానకాలంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 11.93 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 6.61లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా అందులో అత్యధికంగా 5.79 లక్షల ఎకరాల్లో పత్తి, 70 వేల ఎకరాల్లో వరి, 11 వేల ఎకరాల్లో కంది, రెండు వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యాయి. ఈ పంటల సాగును పరిశీలిస్తున్న ఏఈఓలు ఇప్పటి వరకు 30 వేల ఎకరాల లెక్కలు వేసి ట్యాబ్లో ఎంట్రీ చేశారు. పంటల లెక్కల ఆధారంగానే ఈ సీజన్లో ఏ మేరకు ఎరువులు కావాలనేది అధికారులు అంచనా వేసి ఆ మేరకు దిగుమతి చేయించి అన్నదాతలకు అందుబాటులో ఉంచనున్నారు. దాంతో పాటు ఈ లెక్కలను బట్టే ఈ సీజన్లో పత్తి, వరి ఏ మేరకు దిగుబడి వస్తుందనే అంచనా వేసి ఆ పంటలకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపట్టి ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది.
ప్రతి సంవత్సరం సాధారణంగా క్షేత్రస్థాయికి వెళ్లి పంటలను నమోదు చేస్తుండగా ఈ సారి సర్వేను పకడ్బందీగా చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మరో యాప్ను రూపొందించింది. ఈ యాప్లోనే సర్వే నంబర్ల వారీగా భూమి వివరాలు నమోదు చేశారు. ప్రస్తుతం యాప్ ఓపెన్ చేస్తే భూమి వివరాలు తెలుస్తాయి. వీటి ఆధారంగానే ఏఈఓలు సర్వే చేయనున్నారు. దానికితోడు ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఫొటో క్యాప్చరింగ్తో సర్వే చేసే విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నల్లగొండ జిల్లాలో వేములపల్లి మండలాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. ఈ విధానంపై ఇద్దరు ఏడీఏలు, ఇద్దరు ఏఓలకు శిక్షణ ఇచ్చి త్వరలోనే క్రాప్ బుకింగ్ చేపట్టనున్నారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ సారి 11.93 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అంచనా ఉండగా అందులో ఇప్పటి వరకు 6.61 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. సాగు చేసిన పంటలను సర్వే చేసి ఏ రైతు ఎంతమేర, ఏ పంట సాగు చేశారనేది లెక్కలు వేసి యాప్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించటంతో జిల్లాలో సర్వే చేస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో 30వేల ఎకరాల్లో సాగు సర్వే పూర్తయ్యింది. ఈ సారి ఫొటో క్యాప్చరింగ్తో సర్వే కోసం వేములపల్లి మండలాన్ని ఎంపి చేశాం. త్వరలోనే అధికారులకు శిక్షణ ఇచ్చి సర్వే చేపడతాం.
-సుచరిత, జిల్లా వ్యవసాయ అధికారి, నల్లగొండ