హాలియా, ఫిబ్రవరి 21 : తిరుమలగిరి సాగర్ మండలంలోని చిన్న గ్రామం శిల్గాపురం. జనాభా 900 మందికి పైమాటే. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంటుంది. కానీ ఈ గ్రామం నుంచి ఒక్క విద్యార్థి కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్లరు. ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చదువుతున్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధనతోపాటు ఓ ఉపాధ్యాయుడి కృషితో పిల్లల తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది. ఇందులో చదివే విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధిస్తుండడంతో పక్క గ్రామాలైన ఆంజనేయ తండా, పుల్లారెడ్డిగూడెం విద్యార్థులు సైతం ఈ పాఠశాలకే వస్తున్నారు.
90 మంది విద్యార్థులతో కళకళ
శిల్గాపురం ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం నలుగురు ఉపాధ్యాయులు, ఒక వలంటీర్ ఉన్నారు. నాలుగేండ్లుగా ఇంగ్లిష్ మీడియంలో బోధన సాగిస్తున్నారు. గతేడాది 60 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 90 మందికి చేరింది. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉపాధ్యాయులు చదువు చెప్తుండడంతో ఏటా పాఠశాలలో పిల్లల సంఖ్య పెరుగుతున్నది.
ఆనందంగా ఉంది
21 సంవత్సరాలుగా అంకితభావంతో పని చేస్తున్నా. విద్యార్థుల చదువు కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నా. గతేడాది నాకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉంది. శిల్గాపురం పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం మరువలేనిది. ఉపాధ్యాయులు కూడా వినూత్నంగా బోధించేందుకు కృషి చేస్తున్నారు.
– కట్టెబోయిన సైదులు, ప్రధానోపాధ్యాయుడు
చార్టులతో బోధన
పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల అభ్యున్నతికి ప్రధానోపాధ్యాయుడు కట్టెబోయిన సైదులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎనిమిదేళ్లుగా శిల్గాపురం పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఇంగ్లిష్ మీడియం బోధన ప్రవేశపెట్టారు. ఆ తర్వాత విద్యార్థులకు బొమ్మలు, చార్ట్ల ద్వారా బోధన చేయడం మొదలు పెట్టారు. కరోనా సమయంలో విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు మిస్ అవుతున్నారని భావించి ఉపాధ్యాయుల సహకారంతో తెలుగు, ఇంగ్లిష్, గణితం చార్టులు తయారు చేయించి గ్రామ కూడలి, పిల్లలు ఆడుకునే ప్రదేశాల్లో ఏర్పాటు చేయించారు. అక్కడే ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పించారు. దీంతో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరగడంతోపాటు గ్రామస్తుల మన్ననలు అందుకున్నారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై అవార్డు పొందారు.
దాతల సహకారంతోనూ..
పాఠశాల బలోపేతానికి పలువురు దాతలు తోడ్పాటునందించారు. ప్రహరీ లేక ఇబ్బందులు ఎదురవుతుండడంతో గ్రామ పెద్దలు, ఇతరుల సహాయంతో రూ.1.50 లక్షలతో పాఠశాలకు ప్రహరీ నిర్మించారు. విద్యార్థులకు ఆటస్థలం ఏర్పాటు చేయించారు .
గురుకులాల్లో సీట్లు
గురుకుల పాఠశాలలకు ఈ స్కూలు నుంచి ఏటా 10 నుంచి 15 మంది ఎంపికవుతున్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు దీనిపై ప్రత్యేకంగా బోధించడంతో సీట్లు సాధిస్తున్నారు. గతేడాది 17 మంది పరీక్ష రాస్తే 12 మందికి సీట్లు వచ్చాయి. ఇక్కడ ఎలాంటి కోచింగ్ లేకుండానే గురుకులాల్లో సీట్లు సాధిస్తుండడంతో తమ పిల్లలను ఈ పాఠశాలకు పంపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.