నల్లగొండ, ఫిబ్రవరి 21: జిల్లా వ్యాప్తంగా ఈ వేసవి సీజన్కు సంబంధించిన పంటల సాగు ఇప్పటికే పూర్తి కాగా ఆ పంటల వివరాలు వ్యవసాయశాఖ ఆన్లైన్లో నమోదు చేస్తున్నది. గత సీజన్తో పోలిస్తే ఈ సారి వరి సాగు తగ్గగా ఇతర పంటల సాగు గణనీయంగా పెరిగింది. ఎనిమిదేండ్లలో ఇతర పంటల సాగులో తగ్గుదల మాత్రమే కనిపిస్తుండగా ఈ సీజన్లో మాత్రం పెరుగుదల కనిపించడం శుభపరిణామం. మొత్తంగా జిల్లావ్యాప్తంగా గతేడాది 4.75 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ఈ ఏడాది ఈ వేసవి సీజన్లో 55 వేల ఎకరాలు తగ్గి 4.20 లక్షలకు పడి పోయినట్టు వ్యవసాయశాఖ యంత్రాంగం తెలిపింది. గత సీజన్లో 18వేల ఎకరాల్లో ఆయా పంటలు సాగు కాగా ఈ సారి గణనీయంగా పెరిగి 60వేల ఎకరాలకు చేరింది. గత సీజన్తో పోలిస్తే 42 వేల ఎకరాల్లో పెరుగుదల కనిపిస్తున్నది. ప్రధానంగా వేరుశనగ గతేడాది 9వేల ఎకరాల్లో సాగు కాగా ఈ సారి 32వేల ఎకరాలకు పెరిగింది. అంటే మూడు రెట్లు పెరిగిందన్న మాట. ఇక పెసర, నువ్వులు, మిల్లెట్స్, జొన్నలు, ఆవాలు, సోయా, సజ్జలు కూడా మూడు రెట్లు ప్రస్తుత సీజన్లో పెరిగాయి.
ఇతర పంటల సాగు పెరగడం ఇదే తొలిసారి
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో వరి సాగు క్రమంగా పెరుగుతుండగా ఇతర పంటల సాగు తగ్గుదల మొదలైంది. రాష్ట్ర విభజన తర్వాత జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా రావాల్సిన నీటి వాటాలు పూర్తి స్థ్దాయిలో రావడంతో రైతాంగం వరి సాగు వైపు దృష్టి సారించింది. దాంతో రాష్ట్రం రాక ముందు నీటి నిల్వలు లేక వేరుశనగ, పెసర, కందులు, ఇతర పప్పు దినుసులు, నూనె పంటలు సాగు చేసిన రైతాంగం నీటి నిల్వలు పెరగడంతో వాటి వైపు నుంచి క్రమంగా వరివైపు మళ్లింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా గతేడాది మాత్రం 18 వేల ఎకరాలు సాగయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం సూచనతో ఈ సారి రైతుల్లో కొంతమార్పు వచ్చి ఇతర పంటల వైపు దృష్టిసారించారు.ఎక్కువ మొత్తంలో భూమి ఉన్న రైతులు సైతం కొంతభాగం పప్పు దినుసుల పంటలు సాగు చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఈ సారి 55 వేల ఎకరాల్లో వరి సాగు తగ్గి. 42 వేల ఎకరాల్లో ఇతర పంటల సాగు పెరిగింది.
మూడు రెట్లు ఇతర పంటల సాగు పెరిగింది
ప్రభుత్వం సూచనతో ఈ సారి రైతుల్లో చాలా మార్పు వచ్చింది. గతేడాది జిల్లా వ్యాప్తంగా 18 వేల ఎకరాల్లో వేరుశనగ, పెసర, కందులు, నువ్వుల లాంటి ఇతర పంటల సాగు కాగా ఈ సారి మాత్రం 60 వేల ఎకరాలకు పెరిగింది. వేరు శనగ 30 వేల ఎకరాలకు పైగా సాగైంది. ఇతర పంటల సాగు సైతం గతేడాదితో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయి. గతంలో ఎప్పుడు కూడా ఇతర పంటల సాగు పెరగలేదు. ఈ సారి ప్రభుత్వ సూచనతో పెరిగింది. వరి సాగు నుంచి రైతులు మళ్లాల్సి ఉంది.
– శ్రీధర్రెడ్డి, డీఏఓ నల్లగొండ
ప్రభుత్వ సూచనతోనే రైతుల్లో మార్పు
కేంద్ర ప్రభుత్వం ఈ యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలు చేయనని ప్రకటించడంతో ఇతర పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సూచించింది. ప్రతి సీజన్లో వానకాలంలో వరి సాగు చేసినప్పటికీ యాసంగిలో మాత్రం ఇతర పంటలు వేయాలని సూచించింది. దాంతో ఈ సారి రైతాంగం ఇతర పంటలు సాగు చేయడం షురూ చేసింది. ఇప్పటి వరకు వరి సాగుకే అలవాటు పడ్డ రైతులు ఈ సారి తమకున్న భూముల్లో కొంత వరి సాగు చేసినప్పటికీ కొంత మాత్రం ఇతర పంటలు సాగు చేశారు. దాంతో వరి సాగులో 55 వేల ఎకరాల సాగు తగ్గి… ఇతర పంటల్లో 42వేల ఎకరాల సాగు పెరిగింది. అయితే క్షేత్ర స్థ్దాయిలో పర్యటించి సాగు వివరాలు సేకరించిన వ్యవసాయ శాఖ ఆన్లైన్లో పొందు పరిచే విధంగా చర్యలు చేపట్టి ఇప్పటికే 95 శాతం పైగా పూర్తి చేసింది.
ఇతర పంటల వైపు శాలిగౌరారం
శాలిగౌరారం : మండలంలో సరిపడా నీటి వనరులు ఉన్నప్పటికీ వరికి బదులు ఇతర పంటలనే సాగు చేశారు. గతేడాది ఇదే యాసంగి సీజన్లో 16 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రభుత్వ సూచన మేరకు కేవలం 8 నుంచి 10వేల ఎకరాల్లోనే నాట్లు వేశారు. శాలిగౌరారం ఆ యకట్టు ప్రాంతం కావడంతో ప్రతి యేడు 6వేల ఎకరాల్లో వరి సాగు చేసేవారు. ఈ సీజన్లో సుమారు 3 నుంచి 4వేల వరకు మాత్రమే వరి సాగు చేశారు. ప్రభుత్వం చెప్పిన విధంగా వరి పంటను తగ్గించేశారు.
పంటల సాగు ఇలా
మండలంలో ఎన్నడూ లేని విధంగా మొక్కజొన్న, నువ్వులు, కంది, వేరుశనగ పంటలను సాగు చేశారు. వేరుశనగ 200, నువ్వులు 30, కంది 400, ఆముదం 10, మొక్కజొన్న80, మినుములు 70, మిర్చి 80, ఖర్బూజ 50 ఎకరాల్లో సాగు చేసినట్లు అధికారులు చెబుతు న్నారు.
రెండు ఎకరాల్లో వేరుశనగ వేశా..
నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. ప్రతి యేడు వానకాలం, యాసంగిలో వరి వేసేవాన్ని. ఈసీజన్లో కేంద్ర ప్రభు త్వం ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పడంతో రెండు ఎకరాల్లో వేరుశనగ పంటను వేశాను. ప్రభు త్వం, అధికారుల సూచన మేరకు వేరుశనగను ఎంచుకోవడం జరిగింది.