బొమ్మలరామారం, డిసెంబర్ 17 : మండలంలోని మల్యాలలో రూ2.10కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా బాలికల విద్యాలయం నూతన భవనం నిర్మించింది. అన్ని సౌకర్యాలతో భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 2015 సంవత్సరంలో కేజీబీవీ పాఠశాలను 6వ తరగతి నుంచి 8వ తరగతి తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేశారు. 2017 సంవత్సరం నుంచి 10తరగతి వరకు విద్యాబోధన నిర్వహిస్తున్నారు. ప్రతి యేడు పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఫలితాలు సాధిస్తున్నారు. అయితే కేజీబీవీలో బాలికలకు ఇంటర్ విద్య అందుబాటులో లేకపోవడం, గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లేందుకు సమయానుకూలంగా రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇబ్బంది పడేవారు. బాలికలకు కేజీబీవీలోనే ఇంటర్ విద్యను అప్గ్రేడ్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో 2018 సంవత్సరం నుంచి ఇంటర్ తరగతులను ప్రారంభించారు. ప్రతి యేడు విద్యార్థినుల సంఖ్య పెరుగుతూ ఈ యేడాది 296మంది విద్యను అభ్యసిస్తున్నారు.
అన్ని రంగాల్లో రాణిస్తున్న విద్యార్థినులు…
విద్యార్థినులకు ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తుండంతో అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. విద్యతో పాటు క్రీడలు, యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసం, క్రాప్ట్, నూతన వస్తువుల తయారీలో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు.
తీరనున్న తరగతుల కొరత…
మల్యాలలో సకల వసతులతో కేజీబీవీ పాఠశాలను నిర్మించడంతో విద్యార్థినులకు తరగతుల కొరత తీరనుంది. విద్యార్థినులకు సంఖ్యకు అనుగుణంగా నూతన భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే ప్రారంభించనున్నారు.
ఆంగ్లవిద్య పేద విద్యార్థినులకు వరం
కేజీబీవీలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఆంగ్ల విద్య అందుబాటులో ఉండడం పేద విద్యార్థినులకు వరంలాంటిది. నూతన భవనం గురించి అడుగగానే మంజూరుకు కృషి చేసిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డికి రుణపడి ఉంటాం. పాఠశాలలో సోలార్ సిస్టమ్ రిపేరు కోసం మండల పరిషత్ నిధులు రూ.28వేలు కేటాయించాం.
– చిమ్ముల సుధీర్రెడ్డి, ఎంపీపీ
ఇంగ్లిష్ మీడియంలో చదివించాలనే కోరిక తీరింది
నాకు ముగ్గురు ఆడపిల్ల్లలు. ప్రైయివేట్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియం చదివించాలంటే డబ్బులు చాలా ఖర్చు చేయాల్సి వచ్చేది. కేజీబీవీలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడంతో మా ముగ్గురు పిల్లలను చేర్పించాను. పిల్లలు బాగా చదువుకుంటున్నారు. పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదవించాలనే కోరిక తీరింది. తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– రూప, ఫక్కీర్గూడెం