కేతేపల్లి, డిసెంబర్ 16 : మండల పరిధిలోని ఇనుపాముల శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందగా, భార్య, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ ఎం.అనిల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణం విద్యానగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చీదెళ్ల ఫణికుమార్(43) గురువారం కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్లో బంధువుల ఫంక్షన్కు వెళ్లాడు. తిరిగి సూర్యాపేటకు వస్తుండగా ఇనుపాముల వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొని ఫల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఫణికుమార్ తో పాటు అతడి తల్లి కరుణ(62) అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు కారులో ఉన్న ఫణికుమార్ భార్య కృష్ణవేణి, కుమారుడు సాయితరుణ్కు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు కారు అద్దాలు పగులగొట్టి మృతదేహాలను బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్పల్లి కామినేని దవాఖానకు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి బావ పబ్బిశెట్టి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కారు నుంచి మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీసిన 15 నిమిషాల తర్వాత మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. దీంతో ఇతర వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోవడంతో దవాఖాన వద్ద బంధువుల రోధనలు మిన్నంటాయి