మిర్యాలగూడ రూరల్, ఫిబ్రవరి 20: మిర్యాలగూడ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నా.. ఆ గ్రామస్తులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా గ్రామంలోని సర్కారు బడికే పంపుతున్నారు. ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంలో బోధనతోపాటు దాతల సహకారంతో వసతులు కల్పించడంతో ప్రభుత్వ పాఠశాలకు ఆదరణ పెరిగింది. కొత్త పద్ధతుల్లో బోధన అందిస్తుండడంతో ఉపాధ్యాయులపై నమ్మకం కలిగి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారు. దీంతో మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని యాద్గార్పల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది.
పెరిగిన విద్యార్థుల సంఖ్య
ఉన్న ఊర్లోనే ఇంగ్లిష్ మీడియం ఉండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. యాద్గార్పల్లి ప్రాథమిక పాఠశాలలో 2020-21 విద్యా సంవత్సరంలో 111 మంది విద్యార్థులు ఉండగా.. ఈ ఏడాది 203కు పెరిగింది. తరగతుల వారీగా 1వ తరగతిలో 47 మంది విద్యార్థులు, 2వ తరగతిలో 43 మంది, 3వ తరగతిలో 49 మంది, 4వ తరగతిలో 30మంది, 5వ తరగతిలో 34 మంది విద్యార్థులు ఉన్నారు.
ఇంగ్లిష్ మీడియంతో బలోపేతం..
రెండు సంవత్సరాలుగా పరిశీలిస్తే ప్రభుత్వ పాఠశాల పటిష్టంగా మారుతున్నదని విద్యార్థుల సంఖ్య చెబుతుంది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పడిపోయి దీనస్థితికి చేరుతున్న క్రమంలో సర్కారు బడిని నిలబెట్టుకునేందుకు ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో బోధించడం మొదలు పెట్టి విద్యార్థులను పాఠశాలకు రాబట్టుకున్నారు. ఎన్ఆర్ఐ వనమాల దుర్గాప్రసాద్ సహకారంలో పాఠశాలకు పాఠశాలకు ప్రొజెక్టర్, సీపీయూ, మానిటర్, వాల్ స్క్రీన్, డ్యుయల్ డెస్కు బెంచీలు సమకూర్చారు. వాటిని ఉపయోగించి విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో విద్యా బోధన చేస్తున్నారు. పాఠాలతోపాటు నీతి కథలు, క్రీడలు, పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. క్రీడల్లో శిక్షణ, క్విజ్, మంచి చేతి రాతను పెంపొందించే శిక్షణ, గణితంలో మెళకువలు నేర్పిస్తున్నారు. ఇందుకోసం ఉపాధ్యాయులకు సైతం శిక్షణ ఇస్తున్నారు.దీంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేసేందుకు ప్రభుత్వం పూనుకోవడంతో పాఠశాల మరింత బలపడే అవకాశం ఉంది.
టీవీ ద్వారా చదువు చెబుతున్నారు..
మా సార్లు తరగతి గదిలో ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి చదువు చెప్తున్నారు. దీంతో పాఠాలు మంచిగా అర్థమవుతున్నాయి. ఒకటికి రెండు సార్లు వివరిస్తున్నారు. ఇంగ్లిష్పై పట్టు వచ్చేలా వివరంగా చెప్తున్నారు. గతంలో బడికి వెళ్లాలంటే బోరుగా ఉండేది. ఇప్పుడు బడికి పోవాలన్న ఆసక్తి పెరిగింది. చదువుతోపాటు క్రమశిక్షణ, ఆటపాటలు నేర్పిస్తున్నారు. క్విజ్ పోటీలు నిర్వహిస్తూ తెలియని విషయాలను తెలియజేస్తున్నారు.
– ఎర్ర విజయ, విద్యార్థిని
యాద్గార్పల్లి ఎంపీపీఎస్లో ఆధునిక పద్ధతుల్లో బోధన
మావి పేద కుటుంబాలు కావడంతో మా అన్నలు, అక్కలు ఇంగ్లిష్ మీడియం చదివే అవకాశం లేకకపోయింది. ప్రైవేట్ పాఠశాలలో చదువడానికి డబ్బుల్లేక ప్రభు త్వ పాఠశాలల్లో తెలుగు మీడియం చదివారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మాకు ఇంగ్లిష్ మీడియం చదువాలన్న కోరిక తీరుతుంది. మా టీచర్లు బాగా చదువు చెబుతున్నారు. ఆంగ్ల భాషపై మంచి అవగాహన వస్తుంది
– దొడ్డ శివ, విద్యార్థి
ఆంగ్ల మాధ్యమం పేదలకు వరం
వేలకు వేలు ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో పేద విద్యార్దులు ఇంగ్లిష్ మీడియం చదువుకోలేకపోయారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేయడం పేద విద్యార్థులకు వరం. విద్యార్థులు బాడికి బాగా వస్తున్నారు. అందుకు తల్లిదండ్రులు సహకరిస్తున్నారు. గతంలో తెలుగు మీడియం కారణంగా విద్యా సంవత్సరం మారుతుందంటే ఎంత మంది డ్రాప్ అవుతారో తెలిసేది కాదు. నేడు ఆ భయం పోయింది. పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచి, ఆధునిక పద్ధతుల్లో కార్పొరేట్ స్కూళ్లకు తీసిపోకుండా విద్యాభ్యాసం చేస్తున్నాం.
– జి.వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయుడు
గ్రామస్తుల సహకారంతో బలోపేతం..
సర్పంచ్ దుండిగాల యాదమ్మ, విద్యాకమిటీ చైర్మన్ మేడారపు నాగరాజు, గ్రామస్తుల సహకారంతో పాఠశాలను పటిష్టపరిచాం. ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడికి పంపిస్తున్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, చిత్రలేఖనం, క్రమశిక్షణ నేర్పిస్తున్నాం. దీంతో ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం మంచి నిర్ణయం
– జి.వెంకటేశ్వర్లు, హెచ్ఎం, యాద్గార్పల్లి పాఠశాల