సూర్యాపేట, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలతో ఎనిమిదిన్నరేండ్లలో వ్యవసాయం పండుగలా మారింది. సాగునీటి రంగంలో వచ్చిన మార్పులే ఇందుకు నిదర్శనం. ఇరిగేషన్ శాఖను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వర్క్ ఇన్స్పెక్టర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్, ఆపరేటర్లు తదితరాలు కలిపి 124 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిల్లో నల్లగొండ జిల్లాలో 64, సూర్యాపేట 27, యాదాద్రిభువనగిరి జిల్లాలో 33 పోస్టులు ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రాజెక్టులు నిర్మించడంతో ప్రతి ఇంచు భూమిని సాగు చేస్తూ బంగారం లాంటి పంటలు పండిస్తున్నారు. అయితే ప్రాజెక్టులు, కాల్వలు, తూములు మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడంతో వాటిని సరిదిద్దేందుకు ఉద్యోగులను భర్తీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. వాస్తవానికి ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను ఎప్పుడో పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా జోనల్ వ్యవస్థను తీసుకురావడానికి కేంద్రం పెట్టిన కొర్రీలు, ఫైల్స్ తమ వద్దే పెట్టుకోవడంతో క్లియరెన్స్ రావడానికి దాదాపు నాలుగేండ్లకు పైనే పట్టింది. క్రియరెన్స్ వచ్చిన తరువాత ఆయా శాఖల్లో ఖాళీలను గుర్తించి కొద్ది నెలలుగా పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఇరిగేషన్ శాఖలో పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ వెలువడింది.
ఉమ్మడి జిల్లాలో 124 పోస్టుల భర్తీ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇరిగేషన్ శాఖ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో వర్క్ఇన్స్పెక్టర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్, ఆపరేటర్లు, తదితరాలు కలిపి 124 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో నల్లగొండ జిల్లాలో 64, సూర్యాపేట 27, యాదాద్రిభువనగిరి జిల్లాలో 33 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. స్థానిక నిరుద్యోగులకే ఉద్యోగాలు దక్కనున్నాయి. ఉమ్మడి జిల్లాలో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు.