పెద్దఅడిశర్లపల్లి, డిసెంబర్ 14 : పేద విద్యార్థులకు కార్పొరేట్స్థాయి విద్యను అందించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తూ.. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు రాచబాట వేస్తున్నది పీఏపల్లి ఆదర్శపాఠశాల. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన అందించడంతో పాటు విద్యార్థులు సాంకేతిక అంశాల్లో ముందుండేలా ఉపాధ్యాయులు తీర్చి దిద్దుతున్నారు. దాతల సహకారంతో కంప్యూటర్, కుట్టులో ప్రత్యేక శిక్షణను సైతం అందిస్తున్నారు.
ఉత్తమ ఫలితాలు
మండలంలోని దుగ్యాల శివారులో ఉన్న పీఏపల్లి ఆదర్శపాఠశాలలో 6 నుంచి 10 తరగతి వరకు 600 మంది, ఇంటర్లో 240 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు మిగతా విభాగాల్లోనూ తర్ఫీదునిస్తుండడంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. గతేడాది ఇంటర్లో 470 మార్కులకు గాను 462 మార్కులు సాధించిన పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 10 లోపు ర్యాంకులు సాధించారు. పదో తరగతిలో కూడా 2020-21 విద్యాసంవత్సరంలో వందశాతం, 2021-2022 లో 98 శాతం ఫలితాలు సాధించారు. దాంతో పాటు విద్యార్థులను క్రీడలతో పాటు సాంస్కృతిక అంశాల్లోనూ మేటిగా తీర్చి దిద్దుతున్నారు.
దాతల సహకారంతో అభివృద్ధి
మండలంలోని పలువురు దాతల సాయంతో పాఠశాలను అభివృద్ధి పరుస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన గండూరి మార్కండయ్య రూ. 2 లక్షలతో కళావేదిక నిర్మించగా, తేరా కోటిరెడ్డి కంప్యూటర్లు, కుట్టు మిషన్లు సమకూర్చారు. భాస్కర్రెడ్డి తాగునీటి వసతి కల్పించారు. ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి చొరవతో ప్రభుత్వం అందించిన నిధులతో వంటగదులు, క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు.
విద్యార్థులకు సాంకేతిక విద్య
ఆదర్శ పాఠశాలకు ప్రభుత్వం అందించిన నిధులతో పాటు దాతల సహకారంతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు రెగ్యులర్గా కంప్యూటర్ పాఠాలు సైతం బోధిస్తున్నారు. కుట్టుమిషన్లు ఏర్పాటు చేసి విద్యార్థినులకు కుట్టు, ఎంబ్రాయిడరీ వంటి వృత్తి విద్యాకోర్సులు కూడా అందిస్తున్నారు. దాంతో పాటు పీఎంకేవీవై పథకం ద్వారా 40 మంది విద్యార్థులకు మూడు నెలల కంప్యూటర్ కోర్సును కూడా అందిస్తున్నారు.
అందరి సహకారంతో అభివృద్ధి
అదర్శపాఠశాలను దాత లు, ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధి చేస్తున్నాం. ఉపాధ్యాయుల కృషితో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాం. విద్యార్థులకు సాంకేతిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి తరగతిలో రెండు సెక్షన్లు ఉన్నా ఇంకా సీట్ల కోసం పోటీ పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పాఠశాలను అభివృద్ధి చేస్తున్నాం.
–మల్లేశ్, ప్రిన్సిపాల్ ఆదర్శపాఠశాల