నల్లగొండ, ఫిబ్రవరి 20 : రాష్ట్రంలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగి వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నూతన జిల్లా అధ్యక్షుడిగా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీతో పాటు కాంగ్రెస్ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న టీఆర్ఎస్కే మరోసారి పట్టం కట్టేందుకు ప్రజలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తుందని, గిరిజన బిడ్డయిన రవీంద్రకుమార్ను జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసి సీఎం కేసీఆర్ వారిపై ఉన్న ప్రేమను మరోసారి చాటినట్లు తెలిపారు. రవీంద్రకుమార్ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఆరు ఎమ్మెల్యే స్థానాలు గెలవాలని, ఇందుకు ప్రజాప్రతినిదులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఎంతో అనుభవం ఉన్న రవీంద్రకుమార్ ఈసారి ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, దేశంలో మోడీ అధికారం చేపట్టిన ఎనిమిదేండ్లలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుంటే దేశం తిరోగమనం వైపు మళ్లిందన్నారు. దీనికి కారణం మోదీ సర్కార్ కాదా అని ప్రశ్నించారు. ఎనిమిదేండ్లలో ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పథకం పెట్టని మోడీ లాభాల్లో ఉన్న ఎల్ఐసీ, రైల్వే, రక్షణ రంగం లాంటి వాటిని ప్రైవేటు పరం చేస్తూ దేశాన్ని తిరోగమనం వైపు నెట్టారని ఆరోపించారు.
అభివృద్ధిలో తెలంగాణ రోల్మోడల్
సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ వృద్ధి చెంది దేశంలో రోల్ మోడల్ మారుతూ తొలిస్థానం సంపాదిస్తే మోదీ వల్ల దేశం మాత్రం ఆర్థిక భారాలతో ప్రపంచంలోనే చివరి స్థానానికి పడి పోయిందన్నారు. ఆయన పాలనపై విసుగు చెందిన ప్రాంతీయ పార్టీల సీఎంలు బీజేపీ భరతం పట్టి వెనక్కి నెట్టేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ ముంబయికి వెళ్లినట్టు తెలిపారు. గుజరాత్ను మించి తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టాక ఆయన్ని ఘనంగా సన్మానించారు. అంతకుమందు జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ పార్టీ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, నోముల భగత్, చిరుమర్తి లింగయ్య, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచంద్రనాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, నల్లగొండ మున్సిపల్ చైర్మన్, మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పిల్లి రామరాజు, బోనగిరి దేవేందర్, కటికం సత్తయ్య గౌడ్, వశ్యానాయక్, సుంకరి మల్లేశ్గౌడ్, చీర పంకజ్యాదవ్, జిల్లా శంకర్ పాల్గొన్నారు.
కార్యకర్తలు సమన్వయంతో ముందుకెళ్లాలి
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలవట్లేదని, కార్యకర్తలు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పనిచేసిన వారికి ఏదో ఒకసారి తప్పనిసరిగా అవకాశం దక్కుతుందని అయితే ఎవరూ నిరాశ చెందకుండా పార్టీ అభివృద్ధి దిశగా చర్యలు తీసుకోవాలి. పార్టీ బాధ్యత గురుతరమైనదని దాన్ని సమర్థవంతంగా నిర్వహణకు అందరిని కలుపుకుని వెళ్లాలి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరూ కష్టపడి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో అధికారం కోసం అర్రులు చాస్తున్న బీజేపీ, కాంగ్రెస్ను తిప్పికొట్టిలి.
– గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్సీ
అందరి సమన్వయంతో ముందుకెళ్తా
సీఎం కేసీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరిని సమన్వయం చేసుకుని ముందుకెళ్తా. జిల్లాలోని అందరి ప్రజాప్రతినిధులను కలిసి వారి సలహాలు సూచనలు తీసుకుని పార్టీని పటిష్ట పర్చేలా చర్యలు తీసుకుంటా. పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరవేసేలా ముందుకు సాగుతా.
– రవీంద్రకుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే
గిరిజన బిడ్డకు అవకాశం ఆనందదాయకం
తాను నాలుగు పర్యాయాలు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు నిర్వర్తించాని ఈ సారి సీఎం కేసీఆర్ గిరిజన బిడ్డయిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్కు పార్టీ బాధ్యతలు ఇవ్వడం ఆనందదాయకం. పార్టీ బాధ్యతలు చాలా కష్టమని అందరిని కలుపుకుని ముందుకు వెళ్తేనే పార్టీ పటిష్టంగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో అందరిని కలుపుకుపోయి ఆరు స్థానాల్లో విజయం సాధించే దిశగా చర్యలు తీసుకోవాలి.
– బండా నరేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్