యాదాద్రి, డిసెంబర్ 10 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నిత్య తిరుకల్యాణోత్సవం శనివారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం కల్యాణంలో పాల్గొన్న భక్తులు స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్నారు. స్వామివారి నిత్యోత్సవాలు తెల్లవారుజాము నుంచే మొదలయ్యాయి.
ఉదయం సుప్రభాత సేవతో స్వయంభూ నారసింహుడిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయం సందడిగా మారింది. శనివారం సుమారు 27 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయఅధికారులు వెల్లడించారు. స్వామివారి ఖజానాకు రూ. 37,81,139 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, మంత్రి కేటీఆర్ ఓఎస్డీ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితో పాటు మంత్రి కేటీఆర్ ఓఎస్డీ మహేందర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయరీతిలో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ డీఈఓ దోర్బల భాస్కర్ శర్మ స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.