మిర్యాలగూడ టౌన్, డిసెంబర్10 : దేశంలో రైతు ఎజెండాపై భారత రాష్ట్ర సమితి పార్టీని స్థాపించడాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 13 నుంచి 16 వరకు కేరళ రాష్ట్రంలోని తిరుచూర్లో అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు జరుగుతున్నాయని, దేశవ్యాప్తంగా రైతు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలిపారు.
ఈ నెల 16న లక్షలాది మంది రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతుకు మద్దతు ధర కల్పించాలని, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. సకాలంలో రైతులకు పంటరుణాలు అందేవిధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఇప్పటి వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని కోరారు. అతివృష్టి, అనావృష్టి సమయంలో జరిగిన నష్టాలను పంటబీమా పథకాన్ని అమలు చేయాలని అన్నారు.
రైతులకు ఆహార ధాన్యాలు నిల్వ ఉంచుకునే విధంగా గోదాములను నిర్మించి ఇవ్వాలని కోరారు. కేరళరాష్ట్రం మాదిరిగానే రైతులకు బోనస్ ప్రకటించి కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుల ఆత్మహత్యలు నివారించే విధంగా పార్టీలు పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశ్, జిల్లా కమిటీ సభ్యులు తిరుపతి రామ్మూర్తి, పరశురాములు, పాపారావు పాల్గొన్నారు.