నల్లగొండ, ఫిబ్రవరి 20 : ఆశ కార్యకర్తలను గుర్తించి జీతాలు పెంచింది రాష్ట్ర ప్రభుత్వమేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ఆశ కార్యకర్తలకు స్థానిక టీఎన్జీఓస్ భవన్లో ఆదివారం ఆయన స్మార్ట్ఫోన్లు అందించి మాట్లాడారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఆశ కార్యకర్తలకు రూ.4వేలు ఇస్తే, తెలంగాణలో రూ.9,750 అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మీ కడుపు నింపుతున్నందున మీరు ప్రజారోగ్యం కోసం పాటు పడి ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేయాలని కోరారు. ఇప్పటికే ప్రజారోగ్యంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని రానున్న రోజుల్లోనూ ఈ స్థానాన్ని పదిలంగా ఉంచాలన్నారు. స్మార్ట్ ఫోన్లతో ఆశ కార్యకర్తలు స్థానిక సమస్యలు ఎప్పటికప్పుడు పై అధికారులకు తెలపాలన్నారు. కరోనా కష్టకాలంలో ఆశ కార్యకర్తలు ఎంతో పని చేశారని వారి సేవలను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా 27వేల మందికి స్మార్ట్ఫోన్లు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, నోముల భగత్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, డీఎంహెచ్ఓ కొండల్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఆశలతో కలిసి చిందేసిన డీఎంహెచ్ఓ
జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓస్ భవన్లో ఆశ కార్యకర్తలకు మంత్రి జగదీశ్రెడ్డి స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆనందంతో డ్యాన్స్ చేశారు. డీఎంహెచ్ఓ కొండల్రావు సైతం వారితో కలిసి చిందేశారు.