నల్లగొండ, నవంబర్ 26 : ప్రజలకు సంక్షేమ పాలన, సమన్యాయం అందించేందుకు ప్రభుత్వాలకు భారత రాజ్యాగం మార్గదర్శకంగా నిలుస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. 73వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎన్జీ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేయాల్సిన అవసరముందన్నారు. కేంద్రం తరచూ రాజకీయ కోణం లో రాష్ర్టాలపై పెత్తనం కోసం రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నదన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపర్చిన అంశాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు దోహదం చేస్తున్నాయన్నారు.
రాజ్యాంగం మేరకు పాలనా విధానాలు అమలు చేస్తే ప్రజా సంక్షేమం, సమానత్వం సాధ్యమవుంతుదన్నారు. తెలంగాణ వంటి రాష్ర్టాలు అంబేద్కర్ రాజ్యాగం సూచించిన చిన్న రాష్ర్టాల ప్రతిపాదికను అనుసరించి ఏర్పడినవేనని పేర్కొన్నారు. దేశ సమాఖ్య వ్యవస్థ సక్రమంగా కొనసాగేందుకు అంబేద్కర్ నిర్దేశించిన రాజ్యాంగ ప్రమాణాలు అందరికీ అవసరమని పేర్కొన్నారు. ప్రతి పౌరుడూ, పాలకులు రాజ్యాంగ విధులపై అవగాహన కలిగి ఉండి మంచి పౌర సమాజ నిర్మాణం, సుపరిపాలన సాధనలో భాగస్వామ్య ం కావాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ జయచంద్ర, కళాశాల ప్రిన్సిపాల్ గణశ్యాం, సామాజికవేత్త దుశ్చర్ల సత్యనారాయణ, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.