నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి18(నమస్తే తెలంగాణ) : సుమారు రూ.5.4 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్ఐసీ ఐపీఓ ప్రక్రియ వేగం పుంజుకుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ(సెబీ)కి ముసాయిదా ప్రాస్పెక్టర్స్ దాఖలు చేసింది. దాదాపు 5శాతం వాటాకు సరి సమానమైన రూ.31.63 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శి తుహీన్ కాంత పాండే వివరాల ప్రకారం.. ఐపీఓ ద్వారా కేంద్ర ప్రభుత్వం 63 వేల కోట్ల రూపాయలను సమీకరించవచ్చని అంచనా. పబ్లిక్ ఇష్యూలో గరిష్ఠంగా 5శాతం ఉద్యోగులకు, 10శాతం పాలసీదారులకు కేటాయించి మిగతా షేర్లను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ఎల్ఐసీ ఐపీఓకు గతేడాది జూలైలోనే ఆమోద ముద్ర వేయగా.. ఐపీఓ ద్వారా వచ్చే ప్రతి పైసా కేంద్రానికే వెళ్లనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తన పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ద్వారా రూ.78వేల కోట్ల నిధులు సమీకరించాలన్న లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు కేవలం రూ.12,030 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. ఈ లోటును పూడ్చుకోవడం కోసం ప్రస్తుతం ఎల్ఐసీని ఐపీఓకు తీసుకొచ్చి ఈ మార్చిలోనే మిగతా నిధులు సమీకరించవచ్చని కేంద్రం భావిస్తుంది.
ఆరు దశాబ్దాల అనుబంధం..
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)కు ఆరు దశాబ్దాలకు పైగా అనుబంధం కొనసాగుతున్నది. ఆరంభంలో హైదరాబాద్ నుంచి సేవలు అందించగా తర్వాత నేరుగా ఉమ్మడి జిల్లాలో సేవల కోసం నల్లగొండలో 1960 ప్రాంతంలో తొలి బ్రాంచీని ప్రారంభించారు. ఇక ఆ తర్వాత అనతికాలంలోనే పాలసీదారుల మన్ననలు పొందుతూ జిల్లా అంతటా సేవలు విస్తృతమయ్యాయి. ఇలా మొత్తం 8 మెయిన్ బ్రాంచీలు, ఆరు శాటిలైట్ బ్రాంచీలతో ఉమ్మడి జిల్లాలో ఎల్ఐసీ సేవలు కొనసాగుతున్నాయి. నల్లగొండ తర్వాత సూర్యాపేట ఆ తర్వాత వరుసగా మిర్యాలగూడ, కోదాడ, భువనగిరి, చౌటుప్పల్, దేవరకొండ బ్రాంచిలు ఏర్పాటయ్యాయి. చివరగా ఎనిమిదో బ్రాంచిగా నల్లగొండలో రెండో బ్రాంచీని ఏర్పాటు చేశారు. వీటికి అనుబంధంగా పాలసీదారులకు మరింత దగ్గరగా సేవలు అందించేందుకు శాటిలైట్ బ్రాంచీలను నకిరేకల్, హుజూర్నగర్, హాలియా, మోత్కూర్, తిరుమలగిరి, మాల్లో ఏర్పాటు చేశారు. దీంతో ఎల్ఐసీకి ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పాలసీదారులు నమోదయ్యారు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో నల్లగొండ, మెదక్, హైదరాబాద్ జిల్లాలు ఉండగా మొత్తం మార్కెట్లో ఉమ్మడి జిల్లాలో నల్లగొండదే 50శాతం వాటా ఉంటుందని ఎల్ఐసీ వర్గాలు వెల్లడించాయి. ఇలా ఉమ్మడి జిల్లాలో మొత్తం 13లక్షల పాలసీదారులను ఎల్ఐసీ కలిగి ఉందని అంచనా. ఒక్కో మెయిన్ బ్రాంచి పరిధిలో కనీసం 40 మందికి తగ్గకుండా ఉద్యోగులు, సిబ్బంది ఉండగా మొత్తంగా 400 మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు.
వేలాది మంది ఏజెంట్లు, లక్షలాది మంది పాలసీదారులు
ఉమ్మడి జిల్లాలో క్షేత్రస్థాయి వరకు విస్తృతమైన నెట్వర్క్తో ఎల్ఐసీ సేవలు అందిస్తున్నది. సంస్థ రూపొందించిన పాలసీలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు ఉమ్మడి జిల్లా పరిధిలో వేల మంది ఎల్ఐసీ ఏజెంట్లు పనిచేస్తున్నారు. వాస్తవంగా వీరందరికీ కీలకమైన ఉపాధిని కూడా ఎల్ఐసీ కల్పిస్తూ వస్తున్నది. పాలసీల సంఖ్య ఆధారంగా ఏజెంట్లను సైతం ప్రత్యేక ప్రోత్సాహకాలతో నిరంతరం ఉత్తేజ పరుస్తూ పాలసీలను విక్రయిస్తుంది. దీంతో పెద్ద సంఖ్యలో సంస్థకు నమ్మకమైన ఏజెంట్లతోపాటు పాలసీదారులు ఉన్నారు. అన్ని బ్రాంచిల్లో కలిపి జిల్లాలో 5వేల మంది వరకు ఏజెంట్లు పనిచేస్తున్నారు. కోదాడ లాంటి బ్రాంచిలో 900 మంది, మిర్యాలగూడలో 700 మంది, నల్లగొండ వన్లో 500 మంది ఇలా బ్రాంచీల వారీగా ఏజెంట్లు పాలసీలను విక్రయిస్తున్నారు. వీరిని మార్గనిర్దేశనం చేసేందుకు ఎల్ఐసీ అభివృద్ధి అధికారుల(డీఓ)వ్యవస్థ కూడా ఉంది. వీరంతా నిరంతరం సంస్థ సేవల్లో నిమగ్నం కావడం వల్లనే అతిపెద్ద సంస్థగా ఎల్ఐసీ జిల్లాలో ప్రసిద్ధి చెందింది. ఇక పాలసీదారుల సంఖ్య కూడా భారీగానే ఉంది. సుమారు 13 లక్షల పాలసీదారులు ఉంటారని సంస్థ వర్గాలు వెల్లడించాయి. జిల్లా పరిధిలో ఎల్ఐసీ పాలసీదారులు లేని ఆవాసం లేదంటే అతిశయోక్తి కాదు. ఇలా మారుమూల గ్రామాలకు సైతం ఎల్ఐసీ తన సేవలను విస్తరిస్తూ ప్రజల విశ్వాసం చూరగొన్నది. అందుకే ఎల్ఐసీని ఆగం చేస్తామంటే ప్రజలు సహించలేకపోతున్నారు. ఎల్ఐసీకి పోటీగా బీమారంగంలో ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థలను గతంలో కేంద్ర ప్రభుత్వం అనుమతించినా అవి ఎల్ఐసీని ప్రభావితం చేయలేక పోయాయి. దీంతో జిల్లా పరిధిలో ఎల్ఐసీ నేటికీ బీమారంగంలో రారాజుగా వెలుగొందుతూ వస్తున్నది.
ఐపీఓపై ఆది నుంచి నిరసనలే..
ఆరంభం నుంచి నేటి వరకు లాభాల్లో ఉండి ప్రభుత్వాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ పాలసీదారులకు నమ్మకమైన సేవలు అందిస్తున్న ఎల్ఐసీని పబ్లిక్ ఇష్యూకు తీసుకురావడంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సంస్థ ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. వీరితోపాటు ఎల్ఐసీ ఏజెంట్ల సంఘాలు సైతం ఐపీఓపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ఇక పాలసీదారులు సైతం నమ్మకమైన సేవలను దూరం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్ర సరికాదంటూ గళమెత్తుతున్నారు. ఇప్పటికే ఎల్ఐసీ ఐపీఓపై కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా పలుమార్లు సమ్మెలు చేపట్టాయి. ఇందులో ఉమ్మడి జిల్లాలోని సంస్థ ఉద్యోగులు, సిబ్బంది, సాధారణ ప్రజలు సైతం కదం తొక్కారు. టీఆర్ఎస్ అనుబంధ టీఆర్ఎస్కేవీతో పాటుసీఐటీయూ, ఏఐటీయూసీ లాంటి కార్మిక సంఘాలు కూడా అనేక సార్లు దీనిపై ఉద్యమించాయి. కేంద్రం వెనక్కి తగ్గే వరకూ తమ పోరాటాలు కొనసాగిస్తునే ఉంటామని ఎల్ఐసీ ఉద్యోగ, ఏజెంట్ల సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
ఎల్ఐసీ మీద విశ్వాసం పోతుంది..
ప్రభుత్వ రంగ సంస్థ అనే నమ్మకంతోనే ఎక్కువ మంది ఎల్ఐసీని ఆదరిస్తున్నరు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే ప్రజల్లో విశ్వాసం పోతుంది. యాజమాన్యం లాభాపేక్షతో మాత్రమే ఆలోచించి ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టే ప్రమాదం లేకపోలేదు. అన్ని రకాల ఫైనాన్స్ కంపెనీల్లాగే మారిపోతుంది. దీంతో ఎల్ఐసీ పాలసీదారుల సంఖ్య తగ్గిపోతుంది. ప్రైవేటీకరణతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ ప్రైవేటీకరణపై పునరాలోచించాలి.
– గందె ఉపేందర్ రావు, ఎల్ఐసీ పాలసీదారుడు,కట్టవారిగూడెం, గరిడేపల్లి
ఎల్ఐసీ గొంతునులిమే కుట్ర..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎల్ఐసీ గొంతు నులిమే కుట్ర చేయడం దుర్మార్గం. వందలాది మందిని ఏజెంట్లుగా మార్చడంతో వేలాది మందిని పాలసీదారులుగా చేర్పించి మా వంతు సహకారం అందిస్తున్న సంస్థను విక్రయించడం తగదు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నది. లాభాల్లో నడుస్తున్న ఎల్ఐసీని ప్రైవేటీకరణ చేయడం పెట్టుబడి దారులకు, కార్పొరేట్ సంస్థలకు మేలు చేయడమే. బీజేపీ ప్రభుత్వంపై ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు, పాలసీదారులంతా ఐక్యంగా పోరాడాలి.
– వాంకుడోతు పద్మావెంకన్న, ఎల్ఐసీ ఏజెంట్, సూర్యాపేట
కేంద్రం పెద్ద కుట్ర…
కేంద్ర ప్రభుత్వం లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్రలు చేస్తున్నది. మన సంపాదన పదో, పరకో కావచ్చు. కానీ, సంపాదించే ప్రతి పైసా కొంత పొదుపు చేసుకునేందుకు ఎల్ఐసీ కట్టేవాళ్లు కోట్లాది మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎంతో మందికి సామాజిక భద్రత, జీవిత బీమాను అందిస్తూనే దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలబడుతున్న ఎల్ఐసీని ప్రైవేటీకరించడం సరికాదు. ఈ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి.
– గోపగాని గోపాల్, ఎల్ఐసీ పాలసీదారుడు, మల్లాపురం యాదగిరిగుట్ట
ఎల్ఐసీ విభజన ప్రజా వ్యతిరేక చర్య
ఎల్ఐసీని విభజించి స్టాక్ మార్కెట్లో విక్రయించడం ప్రజా వ్యతిరేక చర్య. ఎల్ఐసీలో కేంద్రం ప్రవేశ
పెట్టబోతున్న ఐపీఓకు మేము వ్యతిరేకం. ఎల్ఐసీని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి. దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం తన నిర్ణయాన్ని పునరాలోచించాలి. అణగారిన వర్గాలకు తీవ్ర నష్టం కలిగించే ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి.
– యర్కల యాదగిరి, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి