బొడ్రాయిబజార్, నవంబర్ 22 ;స్వచ్ఛమైన తాగునీరు మానవుల హక్కు. ఈ హక్కును తెలంగాణవాసులందరికీ దక్కేలా చూశారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో ఏ రాష్ట్రం కూడా సంకల్పించని విధంగా మిషన్ భగరీథకు శ్రీకారం చుట్టి గడప గడపకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే సూర్యాపేట ప్రజలను మూసీ మురికి నీటి నుంచి విముక్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మిషన్ భగీరథ పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేశారు. మిషన్ భగీరథ నీటిని ప్రతి ఇంటికి అందించేందుకు జిల్లాలోని బండమీదిచందుపట్ల, ఇమాంపేట, మట్టపల్లి, కిష్టాపురం, చిల్పకుంట్ల, అన్నారిగూడెం, దొండపాడులో ఏడు ట్రిట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ శుద్ధి అయిన నీటిని జిల్లాలోని 2, 39, 691 నల్లా కనెక్షన్ల ద్వారా ప్రతి ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 135-150 లీటర్ల సురక్షితమైన నీటిని అందిస్తున్నారు.
ప్రతి ఇంటికి పరిశుభ్రమైన నీరు
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి చేరే పరిశుభ్రమైన నీటి శుద్ధి ప్రక్రియ ఈ విధంగా సాగుతున్నది. పెద్ద పైప్లైన్ ద్వారా ట్రిట్మెంట్ ప్లాంట్లోని ఎరినేటర్ ద్వారా నీరు అక్యులేటర్కు చేరుకుంటుంది. ఎరినేటర్కు నీరు వచ్చిన సమయంలో ఆలంను నీటిలో కలుపుతారు. అనంతరం ఆ నీరు ఫిల్టర్ బెడ్ల ద్వారా ఫిల్టరై పంప్హౌజ్ ద్వారా క్లియర్ వాటర్ ట్యాంక్కు చేరుతుంది. అక్కడి నుంచి ఆ నీరు క్లోరినేషన్ పూర్తి చేసుకుని గుట్టలపై ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ ట్యాంకులకు అక్కడి నుంచి గ్రామాల్లోని ట్యాంకులకు అక్కడి నుంచి నల్లాల ద్వారా ప్రతి ఇంటికి చేరుతుంది. ప్రతి ట్రిట్మెంట్ ప్లాంట్లో ఏర్పాటు చేసిన ల్యాబ్లో ఎప్పటికప్పుడు(ప్రతి అరగంటకు) నీటి పరిశుభ్రతను పరిశీలిస్తూ చర్యలు తీసుకుంటూ పర్యవేక్షిస్తుంటారు.
సూర్యాపేట వాసులకు తప్పిన మూసి మురికి నీటి కష్టాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సూర్యాపేట పట్టణ ప్రజలు మూసీ మురికి నీటినే తాగునీటిగా తాగారు. పట్టణ ప్రజల మంచినీటి గోసను గుర్తెరిగిన మంత్రి జగదీశ్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్తో ఇక్కడి మంచినీటి సమస్యను ప్రత్యేకంగా ప్రస్తావించి మిషన్ భగీరథ నీటిని అందించేందుకు చర్యలు తీసుకున్నారు. మంత్రి కృషితో సూర్యాపేట పట్టణంలో సరఫరా అవుతున్న మిషన్ భగీరథ నీరు ఒక్కసారి తాగి చూస్తే ఇక మినరల్ వాటర్ వైపు తిరిగి చూసే పరిస్థితే తలెత్తదు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో జరిగే సమావేశాల్లోనూ మిషన్ భగీరథ నీటినే వినియోగిస్తున్నారు. అపోహలు వీడి మిషన్ భగీరథ నీరు తాగి ఆరోగ్యాలను సంరక్షించుకోవాలని అధికారులు చెబుతున్నారు
వైద్యులు సూచిస్తున్నది మిషన్ భగీరథ నీటినే
మిషన్ భగీరథ నీటిని తాగాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు. మినరల్ వాటర్ అంటే భూమిలోని నీటిని ప్యూరిఫై చేసి కెమికల్స్ కలిపి మినరల్ వాటర్గా విక్రయిస్తున్నారని అందులో మినరల్స్ ఉండవన్నారు. భూమిపై పారే నీటిని ప్యూరిఫై చేసి అందించే మిషన్ భగీరథ నీటిలో మినరల్స్ ఉండడంతో ఇది ఎన్నో రకాల రోగాలను నివారించగలుగుతుందని తెలిపారు. గతంలో నల్లగొండను ప్లోరోసిన్ భూతం వెంటాడిందని నేడు కొత్త కేసులు లేవంటే మిషన్ భగీరథ నీటి గొప్పతనం అర్థం చేసుకోవచ్చన్నారు. మినరల్ వాటర్ ద్వారా వచ్చేవి హార్డ్ వాటర్ అని వీటితో కీళ్లు, కాళ్ల నొప్పులు వస్తాయని వెల్లడించారు. మిషన్ భగీరథ నీరు సాఫ్ట్ వాటర్ అని ఈ నీటితో శరీరానికి కావాల్సిన మినరల్స్, ఎలిమెంట్స్ తగిన మోతాదులో అంది డయేరియా, హెపటైటిస్ రాకుండా ఉంటాయన్నారు.
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు
జిల్లాలో 7 ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేశాం. ఈ ప్లాంట్ల ద్వారా నీటిని ప్యూరిపై చేసి జిల్లాలోని 1,344 మంచినీటి ట్యాంకుల ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నాం. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి ఆవాసానికి మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయి.
– వెంకటేశ్వర్లు, ఈఈ, మిషన్ భగీరథ గ్రిడ్
కొన్న నీళ్ళ కంటే మిషన్ భగీరథ నీళ్లే బాగున్నయ్
డబ్బులు పెట్టి కొన్న మినరల్ వాటర్ కంటే మున్సిపాలిటీ వారు సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ నీళ్లే చాలా బాగున్నాయి. ప్లాంట్ వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటే ఒక ధర, ఇంటికి వచ్చి పోస్తే మరో ధర అంటూ తాగే నీటిని అమ్ముతున్నారు. మిషన్ భగీరథ నీరు తాగిన తర్వాత మినరల్ వాటర్ కొనడం బంద్ చేశాం. మేము చాలా రోజుల క్రితమే మినరల్ వాటర్ను బంద్ పెట్టి నల్లానీళ్లే పట్టుకుని తాగుతున్నాం. మినరల్ వాటర్ను మించి మిషన్ భగీరథ నీళ్లున్నాయి.
– దాసరి శోభ, గృహిణి, సూర్యాపేట
మిషన్ భగీరథ నీరు ఎంతో పరిశుభ్రమైంది
మిషన్ భగీరథ ఇమాంపేట ట్రిట్మెంట్ ప్లాంట్లో నేను ఫిల్టర్బెడ్ ఆపరేటర్గా పని చేస్తున్నా. ప్రతి రోజు నా కండ్లతో నీటి శుద్దీ ప్రక్రియను చూస్తున్నా. మిషన్ భగీరథ పథకం ఎంతో ఉన్నతమైనది. స్వచ్ఛమైన మంచినీటినే ప్రతి ఇంటికి అందిస్తున్నారు. ఎటువంటి ఉపయోగం లేని మినరల్ వాటర్ను తాగి కాలక్రమంలో రోగాల భారిన పడేకంటే ఎన్నో ఖనిజ లవణాలతో ప్రభుత్వం అందిస్తున్న శుద్ధమైన మిషన్ భగీరథ నీరు తాగడం ఎంతో ఉపయోగం. ప్రజలు మిషన్ భగీరథ నీటిపై అవగాహన పెంచుకుని వాడుతూ రోగాలకు దూరంగా ఉండాలి.
– నాగలింగం, ఫిల్టర్బెడ్ ఆపరేటర్, ఇమాంపేట
2,39,691 నల్లా కనెక్షన్లకు మిషన్ భగీరథ నీరు
జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామ పంచాయతీలకు మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందిస్తున్నాం. జిల్లాలోని ఏడు గ్రామాల్లో ట్రిట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి 2,39,691 నల్లా కనెక్షన్ల ద్వారా ప్రతి ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 135-150 లీటర్ల నీటిని అందిస్తున్నాం. మిషన్ భగీరథ నీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– పాపారావు, ఈఈ,మిషన్ భగీరథ ఇంట్రా