కల్వకుర్తి రూరల్, ఫిబ్రవరి 18 : స్నేహితుడి వివాహానికి వెళ్లి తిరిగి వెళ్తుండగా కారు అదుపు తప్పి బ్రిడ్జి బారికేడ్ను ఢీకొట్టి బోల్తా పడింది. దాంతో కారులో ప్రయాణిస్తున్న నల్లగొండ జిల్లా కు చెందిన ఇద్దరు, మహబూబ్ జిల్లా కు చెందిన ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల వద్ద జరిగింది. కల్వకుర్తి ఇన్చార్జి సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన అరవింద్(23), పీఏపల్లి మండలం వద్దిపట్ల గ్రామానికి చెందిన శిరీష(20), మహబూబాబాద్ జిల్లా గొల్లచర్ల గ్రామానికి చెందిన కిరణ్మయి(22), మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామానికి చెందిన రేణుక హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో వివిధ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. వీరిలో అరవింద్ కొండమల్లేపల్లిలో నివాసం ఉంటున్నాడు. గురువారం సాయంత్రం వెల్దండ మండల కేంద్రంలో స్నేహితుడి వివాహానికి కారు (టీఎస్ 05 ఈఎం 3380)లో హాజరయ్యారు. మధ్యరాత్రి తర్వాత కల్వకుర్తి- జడ్చర్ల ప్రధాన హైవే మీదుగా తిరిగి హైదరాబాద్కు బయల్దేరారు. ఈ క్రమంలో కల్వకుర్తి మండలం మార్చాల గ్రామ శివారులోకి రాగానే రోడ్డుపై ఉన్న బ్రిడ్జి వద్ద కారు అతివేగంగా బారికేడ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని అరవింద్, శిరీష, కిరణ్మయి అక్కడికక్కడే మృతి చెందారు. రేణుకకు తీవ్ర గాయాలు కావడంతో కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం రేణుకను హైదరాబాద్ దవాఖానకు తరలించారు. అటు వెళ్తున్న డీసీఎం డ్రైవర్ ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. కల్వకుర్తి ఎస్ఐ మహేందర్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుల వద్ద సెల్ఫోన్ల నుంచి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
8 నెలల క్రితం తండ్రి .. ఇప్పడు కుమారుడు
కొండమల్లేపల్లి : మండల కేంద్రానికి చెందిన అన్నెపాక అరవింద్ తండ్రి సిద్ధయ్య ఎనిమిది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దాంతో కుటుంబ పోషణ అరవింద్పై పడింది. తండ్రి సీసీ రోడ్డు కాంట్రాక్టు వర్కర్ తండ్రి మరణంతో అదే వర్క్ను కొనసాగిస్తూ తల్లి మం జుల ఇద్దరు చెల్లెళ్లను పోషిస్తున్నాడు. అరవింద్ మృతితో కుటుంబం రోడ్డు పాలైంది. మాకు దిక్కెవరఅంటూ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.