రామగిరి, నవంబర్ 22 : ఎంజీయూలో వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఇంటర్ కాలేజ్యట్ టోర్నమెంట్(ఐసీటీ) అండ్ ఐయూటీ జట్టు ఎంపికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని కళాశాలల విద్యార్థులు నువ్వా.. నేనా అన్న రీతిలో పోటీపడుతున్నారు. మొత్తం 28 అంశాల్లో జరుగుతున్న క్రీడల్లో ఇప్పటి వరకు బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, వాలీబాల్, ఫుట్బాల్లో జట్లను ఎంపిక చేశారు. కాగా, మంగళవారం జరిగిన కబడ్డీ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి విశేష స్పందన లభించింది. మహిళల జట్లు 14, పురుషుల జట్లు 14 వచ్చినట్లు ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఉపేందర్రెడ్డి వెల్లడించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోటీల్లో విద్యార్థులు హోరాహోరీగా తలపడ్డారు. పోటీలను ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్రెడ్డి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.కృష్ణారావు, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి, ఓఎస్డీ అల్వాల రవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ స్థాయిలో ప్రతిభ చూపి ఐయూటీ జట్టుకు ఎంపికైన క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఎంజీయూ ఖ్యాతి చాటాలన్నారు. స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను వర్సిటీ ఐయూటీ జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కాగా, ఈ పోటీలు బుధవారం సైతం కొనసాగనున్నాయి. కార్యక్రమంలో ఎంజీయూ పీడీలు వై.శ్రీనివాస్రెడ్డి, ఆర్.మురళి, వివిధ కళాశాలల పీడీలు, అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఎంజీయూకు రూ.10 లక్షల విరాళం
ఎంజీయూ అభివృద్ధికి నల్లగొండ పట్టణానికి చెందిన పాదూరి మెహన్రెడ్డి, సుగుణ దంపతుల కుమారుడు, కోడలు ఎన్నారై అమర్రెడ్డి, ప్రసన్న రూ.10 లక్షల విరాళాన్ని యూనివర్సిటీ వీసీ చొల్లేటి గోపాల్రెడ్డి, రిజిస్ట్రార్ తుమ్మ కృష్ణారావుకు అందజేశారు. యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న గ్రామీణ విద్యార్థుల అభివృద్ధికి సాయం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ అల్వాల రవి, డాక్టర్ రమణారెడ్డి, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ అంజిరెడ్డి పాల్గొన్నారు.
సెమినార్ బ్రోచర్ ఆవిష్కరణ
డిపార్ట్మెంట్ ఆఫ్ బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ ఆధ్వర్యంలో డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న సెమినార్ బ్రోచర్ను ఎంజీయూ వీసీ గోపాల్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు డిగ్రీ స్థాయిలోనే పరిశోధనలపై అవగాహన కల్పించడం, వనరులను వినియోగించడం అవసరమన్నారు. సెమినార్లో పాల్గొనే విద్యార్థులు డిసెంబర్ 3లోగా రూ.వెయ్యి చెల్లించాలని, పూర్తి వివరాలకు 9866627028 నంబర్లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ తుమ్మ కృష్ణారావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ఎస్ అన్నపూర్ణ, డాక్టర్ ప్రేమ్సాగర్, సీఈఓ మిర్యాల రమేశ్, శివరాం, డాక్టర్ రామచంద్రగౌడ్, తిరుమల, మురళీమోహన్ పాల్గొన్నారు.