అనుముల మండలం పేరూరు గ్రామంలోని భువనేశ్వరీ సమేత స్వయంభూ సోమేశ్వరస్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. వెయ్యేళ్ల చరిత్ర గల ఈ ఆలయానికి పునర్వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆలయ మండప పునర్నిర్మాణ పనుల కోసం ఇటీవల 40 లక్షల రూపాయలు మంజూరు చేయగా.. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో రూ.40 లక్షలు అవసరం ఉండగా.. ఆలయ కమిటీ దాతల సహాయం కోరుతున్నది.
– హాలియా, నవంబర్ 21
పేరూరు గ్రామంలోని స్వయంభూ సోమేశ్వరాలయాన్ని 12వ శతాబ్దంలో కాకతీయ రాజైన సోమశేఖరుడు నిర్మించారు. అందుకే ఈ ఆలయానికి సోమేశ్వరాలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయంలో పూజలందుకుంటున్న శివలింగాన్ని స్వయంగా శివుడే సృష్టించి ఇచ్చాడని, అగస్త్య మహాముని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. శివ భక్తుడైన అగస్త్య మహాముని శివతత్వం వ్యాప్తిలో భాగంగా దక్షిణ భారతదేశంలో 33చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించారు. ఆయన ప్రతిష్ఠించిన శివలింగాల్లో పేరూరు గ్రామంలోని శివాలయం ఒకటి. శ్రీశైలం క్షేత్రానికి ఈశాన్య భాగంలో ఉండటంతో ఈ ఆలయంలో ఏమి కోరుకున్నా ఇట్టే నెరవేరుతుందని భక్తుల నమ్మకం. దాంతో స్వామివారి దర్శనానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు.
పేరూరు సోమేశ్వరస్వామి ఆలయం మొత్తం రాతితో నిర్మించారు. దేవుడి ఆలయ నీటి అవసరాలు, తెప్పోత్సవం కోసం గ్రామ పైభాగాన చెరువును తవ్వించారు. ఈ చెరువుకు సోమసముద్రం అని పేరు. ఈ చెరువు ఆలయ నీటి అవసరాలు తీర్చడంతోపాటు గ్రామ ప్రజల తాగు, సాగునీటి అవసరాలను కూడా తీర్చుతుంది. ధూప, దీప నైవేద్యం కోసం నాడు కాకతీయ రాజులు ఆలయానికి 400 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమికి కౌలు ద్వారా ఏటా రూ.10 లక్షలకు పైనే ఆదాయం వస్తుంది. అయితే.. గత పాలకుల నిర్లక్ష్యంతో ఆలయ భూమి అన్యాక్రాంతం కాగా, ప్రస్తుతం 119 ఎకరాలు మాత్రమే మిగిలింది. జిల్లాలో అత్యధిక భూమి కల్గిన ఆలయాల్లో పేరూరు స్వయంభూ సోమేశ్వరాలయం ఒకటి. ఈ ఆలయానికి ఉత్తర భాగంగా అహల్య నది ప్రవహిస్తుంది. చరిత్ర క్రమంలో నది పూడిపోయి, ఆక్రమణకు గురికావడం వల్ల ప్రస్తుతం అహల్య వాగుగా మారింది.
ఎంతో పురాతనమైన పేరూరు ఆలయ మండపం పునర్నిర్మాణానికి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఎనలేని కృషి చేశారు. సీజేఎఫ్ (కామన్ గుడ్ ఫండ్) నిధులు మంజూరు చేయాలని 2020 నవంబర్లో దేవాదాయ ధర్మాదాయ శాఖకు దరఖాస్తు పెట్టారు. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మండప పునర్నిర్మాణం కోసం సాంకేతిక అనుమతి ఇచ్చింది. ఇంతలో నోముల నర్సింహయ్య హఠాన్మరణం చెందారు. అనంతరం ఈ విషయాన్ని ఆలయ చైర్మన్ రామలింగయ్య ఎమ్మెల్యే నోముల భగత్కుమార్, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వారు ఆలయ మండప పునర్నిర్మాణం కోసం రూ.40 లక్షల సీజీఎఫ్ నిధులు మంజూరు చేయించారు. ఆ డబ్బుతో ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
పేరూరు స్వయంభూ సోమేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి, పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు నా వంతు కృషి చేస్తా. ఇప్పటికే ఆలయ మండపం పునర్నిర్మాణానికి సీజేఎఫ్ (కామన్ గుడ్ ఫండ్) నిధుల నుంచి రూ.40 లక్షలు మంజూరు చేయించాం. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా డబుల్ రోడ్డు వేయించేందుకు కృషి చేస్తా.
– నోముల భగత్కుమార్, ఎమ్మెల్యే
మా గ్రామ ఆలయ మండపం పునర్నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం ఆనందంగా ఉంది. కాకతీయ వంశ రాజుల పాలనలో నిర్మాణమైన ఈ శివాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నదే నా సంకల్పం. అందుకు దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, ప్రస్తుత ఎమ్మెల్యే భగత్కుమార్తోపాటు జిల్లా మంత్రి సహకరించడం సంతోషకరం. నూతన మండప నిర్మాణానికి రూ.80 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం 40 లక్షల రూపాయలు ఇచ్చింది. మరో రూ.40 లక్షల కోసం దాతల సహకారం తీసుకుంటున్నాం.
– రాయనబోయిన రామలింగయ్య, ఆలయ చైర్మన్, పేరూరు
సీఎం కేసీఆర్ పాలనలోనే ఆలయాలకు పూర్వవైభవం వచ్చింది. గత పాలకులు ఆలయాల అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదు. దేవుడి ధూప దీప నైవేద్యాలు కూడా ఇచ్చేవారు కాదు. అర్చకుల వేతనాలు సకాలంలో వచ్చేవి కావు. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆలయ అర్చకులకు వేతనాలు నెలనెలా ఇస్తున్నారు. ప్రత్యేక శ్రద్ధతో ఆలయాలు పూర్వవైభవం సంతరించుకుంటున్నాయి.
– మోహన్శర్మ, పేరూరు ఆలయ అర్చకుడు