వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నది. సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖలో మార్పులు తీసుకొస్తున్నది. ఏఈఓల విధి నిర్వహణకు లాగర్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా వ్యవసాయ క్షేత్రస్థాయి అధికారులు రోజువారీ విధులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. దీంతో విధుల్లో పారదర్శకత నెలకొంటుంది.
– నేరేడుచర్ల, నవంబర్ 21
జిల్లా వ్యాప్తంగా 82 క్లస్టర్లకు చెందిన ఏఈఓలు ఇప్పుడు మొబైల్ ఫోన్లో లాగర్ యాప్ను వినియోగిస్తున్నారు. వీరు ప్రతి రోజూ తాము వెళ్లదలుచుకున్న రెవెన్యూ గ్రామం వివరాలను ముందే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక చేసుకున్న తరువాత జీపీఎస్ యాక్టివ్ అవుతుంది. దాంతో ఏఈఓలు ఉన్నచోటు అధికారులకు ఇట్టే తెలిసిపోతుంది. ఒకవేళ అధికారిక కార్యక్రమాలు, సమావేశాలకు వెళ్లాల్సి వస్తే ఇదే విషయాన్ని ఆన్లైన్లో నమోదు చేసేందుకు యాప్లో అవకాశం ఉంటుంది. సెలవులో ఉంటే అదే విషయాన్ని ఆన్లైన్లో నమోదు చేయవచ్చు.
క్లస్టర్ పరిధిలో పని చేస్తున్న ఏఈఓలు వ్యవసాయ శాఖ సూచించిన విధంగా 21 అంశాలపై విధులు నిర్వహించాల్సి ఉంటుంది. రైతు వేదికల్లో రైతులతో నిర్వహించిన సమావేశాలు, రికార్డులు, పంటల సాగు లెక్కల వివరాల సేకరణ, మట్టి నమూనాల సేకరణ, పీఎం కిసాన్ అప్డేట్, రైతుబీమా, రైతుబంధు, రైతు విజ్ఞాన యాత్రలు, శాస్త్రవేత్తలతో కలిసి పంటల పరిశీలన, రైతులతో ముఖాముఖి, పంట కొనుగోలు కేంద్రాల పరిశీలన, విత్తనాలు, ఎరువుల పంపిణీ తదితర అంశాల గురించి ఏఈఓలు యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిల్లో ఏదైనా ఒక పని నిత్యం చేయాల్సి ఉంటుంది. చేసిన పనికి సంబంధించిన వివరాలను యాప్లో అడిగే ఆప్షన్లకు అనుగుణంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ పనులు చేసినా, ఒక పని మాత్రమే చేసినా వివరాలను ఆన్లైన్ చేయాల్సిందే.
వరుసగా మూడ్రోజులపాటు వివరాలను అప్లోడ్ చేయకపోతే ఉన్నతాధికారులు తక్షణమే స్పందిస్తారు. వివరాలు అప్లోడ్ చేయని ఏఈఓలకు మెమోలు ఇస్తారు. కెరీర్ మొత్తంలో మూడు సార్లు మెమోలు తీసుకుంటే వారిని ఉద్యోగం నుంచి తొలగించే అవకాశముంది.