రామగిరి, నవంబర్ 21 : వారం రోజులపాటు అట్టహాసంగా జరిగిన 55 జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సోమవారం ముగిశాయి. ఈ నెల 14 నుంచి 20 వరకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలతోపాటు జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థలో రోజుకొక ప్రత్యేక అంశంతో (చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్, వక్తృత్వం) కార్యక్రమాలు నిర్వహించగా విద్యార్థులు, కవులు, రచయితల నుంచి విశేష స్పందన లభించింది. సోమవారం ముగింపు ఉత్సవాలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రోద్యమంతోపాటు తెలంగాణ ఉద్యమం, రాచరిక వ్యవస్థ పోరాటల్లో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషించాయని కీర్తించారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాటి నుంచి నేటి వరకు గ్రంథాలయాలు ప్రజలకు విజ్ఞానం పంచడంలో ఎంతగానో తోడ్పడ్డాయన్నారు. గ్రంథాలయోద్యమానికి శ్రీకారం చుట్టిన శాలిగౌరారం మండల వాసి వట్టికోట ఆళ్వారుస్వామితోపాటు కొమ్మురాజు లక్ష్మణ్రావు సేవలు గ్రంథాలయాల వ్యాప్తిలో చిరస్మరణీయమన్నారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ గ్రంథాలయాలకు పూర్వవైభవం తీసుకొస్తున్నారని తెలిపారు. తాను ఎంపీగా ఉన్న కాలంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ అభివృద్ధికి పలుమార్లు ప్రత్యేక నిధులు అందచేసినట్లు వెల్లడించారు. సూర్యాపేట గ్రంథాలయాలనికి సైతం నిధులిచ్చామన్నారు. దేవరకొండలో మాజీ కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి పేరుతో ఇటీవలే గ్రంథాలయం ప్రారంభించినట్లు తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. తనకు జిల్లా కేంద్ర గ్రంథాలయంతో ఐదేండ్ల అనుంబంధం ఉందన్నారు.
తాను డిగ్రీ చదివిన రోజుల్లో జిల్లా కేంద్ర గ్రంథాలయంతోపాటు ఎన్జీ కళాశాలలో గ్రంథాలయాన్ని ఉపయోగించుకున్నట్లు గుర్తుచేశారు.జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విజ్ఞానంతోపాటు పలు అంశాల్లో విద్యార్థులు, ఉద్యోగార్థులకు బాసటాగా నిలుస్తున్నాయన్నారు. ఆధునిక కాలానికి అనుగుణంగా గ్రంథాలయాలు ఈ-లైబ్రరీలుగా మారుతున్నాయని తెలిపారు. అందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. అనంతరం వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా వివిధ పాఠశాలల చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జెల్లా మార్కెండేయులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గాదె వినోభారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.బాలమ్మ, టీఆర్ఎస్ నాయకుడు యామ దయాకర్, ప్రభుత్వ బాలుర కళాశాల లైబ్రేరియన్ మంగ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ అసిస్టెంట్ లైబ్రేరియన్ నాగయ్య, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.