ఆత్మకూర్.ఎస్, నవంబర్ 21 : ఆస్తి పాస్తులు లేకున్నా పూరి గుడిసెలో ఉంటూ రెక్కలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న కడుబీద కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. ఎందరో ఇళ్లలో వెలుగులు నింపిన అతడి కుటుంబం ప్రస్తుతం అంధకారంలో మునిగిపోయింది. విద్యుత్ కార్మికుడు బొడ్డు వీరయ్య విద్యుత్ స్తంభం పైనుంచి ప్రమాదవశాత్తు పడి నడుము కింది భాగం చచ్చుబడగా ఆ కుటుంబం పూటగడిచేందుకు అష్టకష్టాలు పడుతూ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం, కోటపహాడ్ గ్రామానికి చెందిన బొడ్డు వీరయ్యకు భార్య వెంకటలక్ష్మి, కుమారై, కుమారుడు ఉన్నారు. గ్రామంలో ఓ చిన్నపాటి పూరి గుడిసె తప్ప వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులేమీ లేవు. అతడు కరెంట్ పని నేర్చుకోవడంతో ఓ లైన్మన్కు సహాయకుడిగా పనికి కుదిరాడు. భార్య వెంకటలక్ష్మి కూలికి వెళ్తూ ఉన్నంతలో జీవనం సాగిస్తున్నారు. ఏడాది క్రితం వీరయ్య మరమ్మతు చేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడడంతో వెన్నుముక, నడుము భాగంలో తీవ్ర గాయమైంది. ప్రాణాపాయం తప్పినా కదల్లేని పరిస్థితి. కనీసం మూత్రం వచ్చినా, బహిర్భూమికెళ్లాలన్నా స్పర్శ లేకుండా పోయింది. వీరయ్య మంచానికే పరిమితం కాగా, భార్య అతన్ని వదలి ఎటూ వెళ్లలేని పరిస్థితి.
ఏడాది క్రితం వీరయ్య గాయపడగా ఇప్పటికీ అతని మందుల కోసం నెలకు రూ.3వేలు ఖర్చువుతోంది. కడు పేదరికాన్ని అనుభవిస్తున్న ఆ కుటుంబానికి మందుల కొనుగోలు ఇబ్బందిగా మారింది. అతడు విద్యుత్ సిబ్బంది కాకపోవడంతో సంస్థ నుంచి ఎలాంటి ఆర్థిక సాయమూ రాలేదు. వీరయ్యను వదిలి భార్య ఏ పనులకూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దాతలెవరైనా సహకరించాలని ఆ కుటుంబం వేడుకుంటోంది. దాతలు 9951731908 నంబర్కు ఫోన్ పే, గూగుల్ పే చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
ఏడాది క్రితం జరిగిన ప్రమాదంలో నా భర్తకు నడుము కింద నుంచి స్పర్శ లేకుండా పోయింది. అప్పటి నుంచి నా ఇద్దరు పిల్లలతో పాటు భర్తనూ చిన్న పిల్లాడిలా చూసుకోవాల్సి వస్తున్నది. ఎలాంటి పనులకు వెళ్లే పరిస్థితి లేదు. ఇల్లు గడవడం కష్టంగా ఉంది. పూరి గూడిసెలోనే కాలం వెళ్లదీస్తున్నాం. దాతలు సహకరించి మా కుటుంబాన్ని ఆదుకోవాలి.
– బొడ్డు వెంకటలక్ష్మి, వీరయ్య భార్య