ఆలేరు, నవంబర్ 21 : తెల్ల బంగారం మెరిసిపోతున్నది. రైతన్న ఇంట సిరులు కురిపిస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉండడంతో మంచి ధర పలుకుతున్నది. సీసీఐ మద్దతు ధర క్వింటాల్కు రూ.7,200 దాటి ఎవ్వరూ ఊహించని విధంగా 8వేల పైకి ఎగబాకింది. ఆలేరు మార్కెట్లో క్వింటాల్కు గరిష్ఠంగా రూ.8,800 ధర పలికింది. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా నల్లరేగడి భూముల్లో ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల మధ్య దిగుబడి వస్తుంది. గతంతో పోలిస్తే ఈ సీజన్లో అకాల వర్షాల కారణంగా పూత, కాత దశలో పంట దెబ్బతిన్నది. చీడపీడల ఉధృతి ఎక్కువై దిగుబడి భారీగా తగ్గింది. అయినప్పటికీ పంజాబ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో తెలంగాణ మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దీంతో సీసీఐ ప్రకటించిన మద్దతు ధరకు మించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.
ఆలేరు మండలంలో 10వేల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, లక్ష క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ, అధిక వర్షాలు పంటను దెబ్బతీయడంతో ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లే దిగుబడి వస్తుంది. మండల కేంద్రంలో దీపావళికి ముందే పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. ఆలేరు, శారాజీపేట మార్కెట్ యార్డుల్లో ప్రైవేట్ వ్యాపారులు కొనుగోళ్లు చేస్తూ జిన్నింగ్ మిల్లుల్లో విక్రయిస్తున్నారు.
ఈ యేడు వానలు అధికంగా పడ్డయి. అందుకే పంట దిగుబడి బాగా రాలేదు. అయినా రేటు బాగుంది. పండిన కొద్ది పంటైనా అధిక ధర ఉన్నందుకు సంతోషంగా ఉంది.
-మల్లయ్య, రైతు, ఆలేరు
10 ఎకరాల్లో పత్తి సాగు చేసిన. కానీ, వర్షాలు ఎక్కువ కురిసి పంట దెబ్బతిన్నది. దిగుబడి ఎక్కువగా రాలేదు. వచ్చిన పత్తిని మిల్లులో అమ్మితే 8,700 ధర వచ్చింది.
-లక్ష్మయ్య, రైతు, ఆలేరు