వ్యవసాయం అంటేనే కష్టంతో కూడినది. ఆరుగాలం కష్టపడితేనే కొంత ఆదాయం మిగులుతది. కానీ, ఆకుకూరలు, కూరగాయల సాగులో మాత్రం నిత్యం ఆదాయం కనిపిస్తుంది. కష్టపడి సాగు చేపడితే రోజూ డబ్బులను కండ్ల చూడవచ్చని, ఎకరాకు ఖర్చులు పోను ఏడాదికి రూ.2 లక్షలకు పైగానే సంపాదించవచ్చని మిర్యాలగూడ మండలం ఐలాపురానికి చెందిన సండ్రాల వెంకన్న అనే యువ రైతు నిరూపిస్తున్నాడు.
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి..
వెంకన్న గత 15 ఏండ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. వరి సాగు గిట్టుబాటు కాకపోవడం, ధాన్యం అమ్మకం కూడా కష్టతరంగా మారడంతో ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టిసారించాడు. భార్య మంగమ్మ, తల్లి మల్లమ్మ సాయంతో తనకున్న మూడున్నర ఎకరాల్లో సేద్యం చేస్తున్నాడు. గతంలో ఆదర్శ రైతుగా పని చేసిన అనుభవం, కంపాసాగర్లోని కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణతో పాటు ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాశ్పాలేకర్ వద్ద పొందిన శిక్షణతో వ్యవసాయంలో నూతన ఒరవడిపై దృష్టి కేంద్రీకరించేలా తనను మార్చాయని చెబుతున్నాడు.
ఎత్తుమడులపై ఆకు కూరలు..
ఆయకట్టు కింద ఉన్న రెండెకరాల్లో వరి సాగు చేస్తూ.. మిగతా ఎకరన్నరలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నాడు. పండించిన కూరగాయలు, ఆకుకూరలైన సొర, బీర, బెండ, కాకర, పాలకూర, చుక్కకూర, తోటకూర, బచ్చలికూరను 7 కిలోమీటర్ల దూరంలోని మిర్యాలగూడ రైతుబజారులో స్వయంగా అమ్ముతున్నాడు. రోజుకు కనీసం వెయ్యి రూపాయలు తగ్గకుండా సంపాదిస్తున్నాడు. ఆకుకూరల సాగుతోపాటు పాడి పశువులైన ఆవులు, బర్రెల ద్వారా ఆదాయం గడించడమే కాకుండా వాటి పేడ, మూత్రాన్ని సేంద్రియ సాగుకు ఉపయోగిస్తున్నాడు. ఎకరన్నర భూమిలో ఎత్తుమడులు(4 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవు, అడుగు ఎత్తుపై) చేసి మిశ్రమ పద్ధతుల్లో సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నాడు.
40 రోజులకోసారి విత్తడం..
ఎకరన్నర భూమిని 6 భాగాలుగా చేసుకుని వాటిల్లో ఎత్తుమడులను పీకలుగా చేసి దఫాల వారీగా విత్తుకుంటూ ఏడాది పొడవునా ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నాడు. నిత్యం ఆదాయం వచ్చేలా ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నాడు. పాలకూర, చుక్కకూర, మెంతికూర, గోంగూర, పుదీనాతోపాటు బెండ, బీర, దోస, సొర, కాకర పండిస్తున్నాడు. మొదట అర ఎకరంలో సాగు ప్రారంభించి 40 రోజుల తర్వాత మరో అరెకరంలో సాగు చేస్తాడు. ఇంకో అరెకరంలో మరో 40 రోజులకు గింజలు విత్తుతారు. ఇలా ఏడాది పొడవునా కుటుంబ సభ్యులు కష్టపడుతూ మంచి లాభాలు గడిస్తున్నారు.
ఆకు కూరల సాగు లాభదాయకం
కూరగాయలు, ఆకుకూరల సాగు లాభదాయకంగా ఉంటుంది. కష్టపడి పండించిన పంటలను నేనే స్వయంగా మిర్యాలగూడలోని కూరగాయల మార్కెట్, రైతుబజారులో అమ్ముతుంటా. నెలకు రూ.30 వేలకు పైనే ఆదాయం వస్తుంది. ప్రతిరోజూ పంట కోసి అమ్మడంతో నిత్య ఆదాయం కనిపిస్తుంది. ఏడాదికి ఎకరాకు రూ.2 లక్షలకు పైగానే సంపాదిస్తా. వరి సాగుతో ఇంత ఆదాయం రాదు.
– సండ్రాల వెంకన్న, రైతు, ఐలాపురం
ఆకుకూరల కోత ఇలా..
పాలకూర విత్తిన 30 రోజుల్లో కోతకు వస్తుంది. ఆ తర్వాత 8 రోజులకు ఒకసారి చొప్పున 15 నుంచి 20 కోతలు వస్తాయి. చుక్కకూర 30-40 రోజుల్లో మొదటి కోతకు వస్తుంది. ఈ తర్వాత 8-9 రోజులకోసారి 9 కోతలు వస్తాయి. మెంతికూర విత్తిన 15 రోజులకు పీకేయాలి. మళ్లీ విత్తుకోవాలి. ఆకుకూర తోటలొ కలుపును 20 రోజులకు ఓసారి తొలగిస్తారు. పండిన ఆకుకూరలు, కూరగాయలను వెంకన్న స్వయంగా మిర్యాలగూడలోని రైతుబజారులో విక్రయిస్తూ ఎకరాకు రూ.2 లక్షలకు పైగానే ఆదాయాన్ని గడిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.