తుర్కపల్లి, ఫిబ్రవరి18 : దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర పోలీస్ శాఖకు అనేక నిధులు కేటాయించి ఆ శాఖను బలోపేతం చేయడంతో పోలీసులు కేసుల చేధనలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో రూ. కోటి వ్యయంతో అధునాతనంగా నిర్మించిన నూతన పోలీస్స్టేషన్ భవనాన్ని శుక్రవారం ఆయన ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, రాచకొండ సీపీ మహేశ్భగవత్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ శాంతిభద్రతలు ఎక్కడైతే వెల్లివిరుస్తాయో అక్కడ అభివృద్ధి జరుగుతుందన్నారు.
ప్రజలు ప్రశాంత జీవితం సాగించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పోలీసు వ్యవస్థను బలోపేతం చేసిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అందిస్తున్న సేవలు ఎనలేనివన్నారు. గతంలో పోలీస్స్టేషన్ నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతో పోలీసులు లంచాలకు పాల్పడేవారన్నారు. చిన్న పేపర్ కావాలన్న బాధితులతోనే తెప్పించే పరిస్థితి ఉండేదన్నారు. పోలీసు వ్యవస్థలో అవినీతి నిర్మూలనకు సీఎం కేసీఆర్ పోలీస్స్టేషన్ నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారన్నారు. ఒక నిమిషం కరెంట్ పోకుండా నాణ్యమైన విద్యుత్ను అందించడంలో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా కొనసాగుతుందన్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందిస్తూ రైతాంగానికి అండగా నిలుస్తున్నారని చెప్పారు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ ఉచితంగా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణేనని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయిన మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి కరువు నేలకు గోదావరి జలాలను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కోరిక మేరకు మోటకొండూర్ పోలీస్స్టేషన్కు నూతన భవనం, తుర్కపల్లి మండల కేంద్రం లోని పీహెచ్సీ ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రధాన రోడ్డు ప్రాంతానికి తెస్తామని ఈ సందర్భంగా హామీనిచ్చారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.