నాటి ఉద్యమాలకు కేంద్రాలుగా మన గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడ్డాయని, ఆ సమయంలో సూర్యాపేట గ్రంథాలయం ఉద్యమానికి పురుడుపోసిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రంథాలయాలకు పూర్వవైభవం వచ్చిందని, రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాల ఆధునీ కరణలో ఆయన చొరవ ఎనలేనిదన్నారు. విద్యార్థులు బాల్యం నుంచే పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు గ్రంథాలయాలను సద్వినియోగించుకొని ఉద్యోగాలు సాధించాలని సూచించారు.
సూర్యాపేట టౌన్, నవంబర్ 20 : నాటి ఉద్యమాలకు కేంద్రాలుగా మన గ్రంథాలయాలు ఎంతో దోహదపడ్డాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అలాంటి గ్రంథాలయాలకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో పూర్వ వైభవం వచ్చిందన్నారు. 55వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రంలోని గ్రేడ్-1 శాఖ గ్రంథాలయంలో ఆదివారం నిర్వహించిన వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విజ్ఞానదాయక సమాజం ఎదగాలంటే గ్రంథాలయాలు ఎంతో అవసరమన్నారు.
అలాంటి గ్రంథాలయాలను కాపాడుకోవడం మనందరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పుస్తక పఠనం జీవితానికి నాణ్యతను జోడిస్తుందన్నారు. విద్యార్థులు బాల్యం నుంచే పుస్తక పఠనం అలవర్చుకుంటే, అది వారి భవిష్యత్కు మేధో కార్యకలాపంగా పని చేస్తుందన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా జిల్లాలో లైబ్రరీలు సైతం రూపు మార్చుకుంటున్నాయన్నారు. జిల్లాలో ప్రతి మండలానికీ ఓ డిజిటల్ లైబ్రరీ ఉండేలా దాని సేవలు ప్రజలకు, పాఠకులకు అందేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నదన్నారు. గ్రంథాలయాల నిర్మాణాల్లో చైర్మన్, సిబ్బంది సేవలు అభినందనీయమని కొనియాడారు. త్వరలో సూర్యాపేటలో నూతన గ్రంథాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి విశాలంగా నిర్మిస్తామన్నారు. వారోత్సవాల్లో విద్యార్థులు, పాఠకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు మంత్రి జగదీశ్రెడ్డి బహుమతులు అందించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన వేడుకలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ ఉప్పల లలితాఆనంద్, కౌన్సిలర్లు తాహేర్ పాషా, నిమ్మల స్రవంతీశ్రీనివాస్, అనంతుల యాదగిరి, రాపర్తి శ్రీనివాస్, కుంభం రాజేందర్, డైరెక్టర్లు రియాజ్, కల్లేపల్లి మహేశ్వరి, సల్మా మస్తాన్, గ్రంథాలయ సెక్రటరీ సీతారామశాస్త్రి, శ్యాంసుందర్రెడ్డి, రంగారావు, భాస్కర్ పాల్గొన్నారు.