యాదాద్రి పంచనారసింహుడి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. కార్తికమాసం చివరి ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కరోజే 80 వేల మంది భక్తులు దర్శించుకోగా చరిత్రలోనే స్వామివారి ఖజానాకు రూ.1,16,13,977 ఆదాయం సమకూరింది. వ్రత మండపాలు, మాఢవీధులు, క్యూ కాంఫ్లెక్స్, ప్రసాద విక్రయ కేంద్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భారీగా తరలివచ్చిన వాహనాలతో గుట్ట పరిసరాలన్నీ కిటకిటలాడాయి.
యాదాద్రి, నవంబర్ 20 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ఆదివారం గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1,16,13,977 రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. కార్తిక మాసంతో పాటు సెలవు దినం కావడంతో స్వయంభువుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేవలం ప్రసాద విక్రయాలతోనే రూ.44,37,150 ఆదాయం సమకూరడం విశేషం. వీఐపీ దర్శనాలు, బ్రేక్ దర్శనాల్లో 3,250మంది భక్తులు పాల్గొన్నారు. ధర్మ దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూ కాంప్లెక్స్ మూడంతస్తులతో పాటు క్యూలైన్లు నిండిపోయాయి.
వీవీఐపీ దర్శనానికి వచ్చిన భక్తులు తూర్పు రాజగోపురం నుంచి ఈశాన్య మాఢవీధుల గుండా లిఫ్టు వరకు క్యూకట్టారు. అక్కడి నుంచి వాయువ్య దిశలో గల అష్టభుజి ప్రాకార మండపం నుంచి తూర్పు రాజగోపురం, త్రితల రాజగోపురం, ఆలయ ముఖ మండపంలోని క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. పార్కింగ్ ప్రాంతంతో పాటు కొండపైన వివిధ ప్రాంతాలు వాహనాలతో రద్దీగా మారాయి. దీంతో భక్తులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వెంటనే స్పందించిన ఆలయాధికారులు, పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది వాహనాలను రద్దీని అదుపులోకి తీసుకొచ్చారు. వాహనాలను దారి మళ్లించి తిరిగి కొండకిందకి పంపారు. కొండచుట్టూ రింగురోడ్డుపై వాహనాలే దర్శనమిచ్చాయి. కొండపైకి వెళ్లే ఫ్లైఓవర్ నుంచి ప్రధాన కూడళ్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామైంది.
స్వామివారి ధర్మ దర్శనానికి 4 గంటలు, వీఐపీ దర్శనానికి 3గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. స్వామి, అమ్మవార్ల నిత్యతిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొండకింద వ్రత మండపంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో 1,900మంది దంపతులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామి వారిని సుమారు 80వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. దీంతో స్వామివారి ఖజానాకు భారీ ఆదాయం సమకూరింది. గత ఆదివారం కోటి 9లక్షల పైచిలుకు ఆదాయం రాగా ప్రస్తుతం రూ.1,16,13,977 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారికి ఏకాదశి పర్వాలు
కార్తిక మాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధానాలయంలో ఆదివారం లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా జరిపించారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు చేశారు.