శాలిగౌరారం, నవంబర్ 20 : శాలిగౌరారం మండల ప్రజల దశాబ్దాల కల నిజం కాబోతున్నది. గురజాల- మానాయికుంట గ్రామాల మధ్య మూసీ వాగుపై యేండ్ల తరబడి బ్రిడ్జి లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడేవారు. మండల ప్రజలు మానాయికుంట, తిరుమలగిరి, తుంగతుర్తి, అడ్డగూడూరు, మోత్కూర్ తదితర గ్రామాలకు వెళ్లాలంటే గురజాల-మానాయికుంట గ్రామాల మధ్య ఉన్న మూసీ వాగులోంచి మోకాళ్లలోతు నీళ్లగుండా వెళ్లాల్సి వచ్చేది. ఎన్నో ప్రభుత్వాలు, పాలకులు మారిన ఆ వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బ్రి డ్జిలు, రహదారులపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్మాణాలు చేపట్టింది. అందులో భాగంగానే శాలిగౌరారం మండలం గురజాల-మానాయికుంట గ్రామాల మధ్య ఉన్న మూసీ వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టి పూర్తి చేసింది.
నెరవేరిన ఎమ్మెల్యే కిశోర్కుమార్ హామీ
2014 ఎన్నికల ప్రచార సమయంలో మూసీ వాగులోంచి నడుచుకుంటూ వెళ్తున్న ప్రజలు, ద్విచక్రవాహనాలతో తోసుకుంటూ వెళ్తున్న ప్రయాణికులను చూసిన చలించిపోయారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన గాదరి కిశోర్కుమార్ వెంటనే మూసీలో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి ఏప్రిల్ 19, 2017న బ్రిడ్జి నిర్మాణానికి రూ.18 కోట్లు నిధులను మంజూరు చేసింది. పనులను అప్పటి రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రారంభించారు.
నాలుగు జిల్లాలకు అనుసంధానం
ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో నల్లగొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని వందల సంఖ్యలో గ్రామాలను కలపనుంది. గతంలో వర్ష్షాకాలం సమయంలో మూసీ ప్రవహిస్తున్న క్రమంలో నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తి, తిరుమలగిరికి వెళ్లాలంటే మండల ప్రజలు నకిరేకల్, సూర్యాపేట, అర్వపల్లి మండలాల మీదుగా సుమారు 30 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసి చేరుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో బ్రిడ్జిపై నుంచే ప్రజలు రాకపోకలను సాగిస్తున్నారు. కానీ మండలంలోని గురజాల బీటీ రోడ్డు నుంచి సుమారు 650 మీటర్ల దూరంలో భూసేకరణ చేపట్టాల్సి ఉంది. రైతులకు నష్టపరిహారం చెల్లించి రోడ్డు వేస్తే మార్గం సుగుమం కానుంది.
అప్రోచ్ పనులు పూర్తి చేస్తా
2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా మూసీ వాగు నుంచి నడుచుకుంటూ పోయే ప్రజల కష్టాలను చూసి బాధ కలిగింది. అధికారంలోకి రాగానే బ్రిడ్జి నిర్మాణం చేపడుతానని హామీ ఇచ్చాను. ఆ హామీ మేరకు నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించా. రోడ్డు నిర్మాణం కోసం రైతులను ఒప్పించి త్వరలో అప్రోచ్ పనులు పూర్తి చేస్తాను.
– గాదరి కిశోర్కుమార్, ఎమ్మెల్యే తుంగతుర్తి