వ్యవసాయంలో 1958వ సంవత్సరంలో వాడుకలోకి వచ్చిన యూరియా పంటల సాగులో అత్యంత కీలకంగా మారింది. నత్రజని లేకుంటే పొలాలకు ప్రాణం లేనట్టే. అయితే.. ఘన రూపంలో ఉండే యూరియాకు ప్రత్యామ్నాయంగా ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కో ఆపరేటివ్ (ఇఫ్కో) సంస్థ నానో టెక్నాలజీ (ద్రవ) రూపంలో మార్కెట్లోకి విడుదల చేసింది. దీంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.
ఎకరానికి అర లీటర్..
ప్రస్తుతం మార్కెట్లో యూరియా బస్తా రూ.270నుంచి రూ.290 వరకు లభిస్తున్నది. సీజన్లో ఒక్కోసారి వ్యాపారులు 350 రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు. ద్రవ రూపంలో లభించే నానో యూరియా అర లీటర్ రూ.200నుంచి రూ.240 వరకు ధర ఉంటుంది. ఇది ఎకరానికి సరిపోతుంది. అర లీటర్ నానో యూరియా బాటిల్ ఒక బస్తా యూరియాకు సమానం. ఘన రూపంలో ఉండే యూరియా ప్రభావం మొక్కపై వారం రోజులు ఉంటుంది. ద్రవ రూపంలో ఉండే నానో యూరియా 15 రోజులపాటు ప్రభావాన్ని చూపుతుంది. నానో యూరియా రవాణా చేయడం చాలా సులభం. జేబులో, బ్యాగులో పెట్టుకుని తీసుకెళ్లవచ్చు. ఫలితంగా రవాణా ఖర్చు తగ్గుతుంది.
ద్రవరూప యూరియా ఉపయోగాలు
సంప్రదాయ యూరియాతో పోల్చితే నానో యూరియా అవసరం తక్కువగా ఉంటుంది. పంటల ఉత్పాదకతను పెంచుతుంది. ఆహారం, పర్యావరణానికి సురక్షితమైనది. వృక్ష, జంతు జాలానికి విషపూరితం కాదు. రైతులకు సబ్సిడీతో కూడిన యూరియా బస్తా కంటే 10శాతం తక్కువ ధరకే ద్రవ రూప యూరియా లభిస్తుంది. పంట దిగుబడి పెరుగుతుంది.
సాధారణ యూరియాతో పోలిస్తే గాలి, నేల, నీటి కాలుష్యం ఉండదు. ద్రవ రూప యూరియాలో సరాసరిగా 1.5శాతం నత్రజని, 1శాతం పొటాషియం, 0.5శాతం కాల్షియం, 0.2శాతం పాస్ఫరస్, 0.2శాతం మెగ్నీషియం, 0.1శాతం సల్ఫర్ ఉంటాయి. నానో యూరియా మొదటి పిచికారీ విత్తనం మొలకెత్తిన 30రోజుల తర్వాత, రెండో పిచికారీ పుష్పించే వారం ముందు చేయాలి. లీటర్ నీటిలో 4మి.మీ. చొప్పున కలిపి స్ప్రే చేయాలి. దీంతో నత్రజని నేరుగా మొక్కల పత్రహరితంలోకి చొచ్చుకుపోతుంది. నత్రజని ఎక్కువ అవసరం ఉన్నా నానో యూరియా ప్రయోజనకారిగా ఉంటుంది.a
నానో యూరియాలో 80 శాతం నత్రజని
నానో యూరియా వాడకంతో అనేక లాభాలు ఉన్నాయి. ఇందులో 80శాతం నత్రజని ఉంటుంది. అర లీటర్ నానో యూరియా ఒక యూరియా బస్తాతో సమానం. ఖర్చు చాలా ఆదా అవుతుంది. మొక్కలకు కావాల్సిన నత్రజని పోషకం ద్రవ రూపంలో ఎక్కువ శాతం అందుతుంది. నానో యూరియాను అన్ని పంటలకు వాడుకోవచ్చు.
– భవన్, ఏఈఓ, మఠంపల్లి