కార్తిక మాసం చివరి శనివారం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో భక్తజన కోలాహలం నెలకొంది. దాదాపు 45వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. దంపతులు సత్యనారాయణ వ్రతం ఆచరించారు. కార్తిక దీపారాధన చేశారు. క్యూ కాంప్లెక్స్, మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో ఎటుచూసినా భక్తులే కనిపించారు. స్వామివారి ధర్మదర్శనానికి 3 గంటలు సమయం పట్టింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అజయ్ రస్తోగి కుటుంబ సమేతంగా యాదా్రద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
– యాదాద్రి, నవంబర్ 19
యాదాద్రి, నవంబర్ 19 : కార్తిక మాసం చివరి శనివారం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో భక్తజన కోలాహలం నెలకొంది. కొండ కింద వ్రత మండపంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతాల్లో 1,578మంది దంపతులు పాల్గొన్నారు. ఉదయం నుంచి మహిళలు అధిక సంఖ్యలో దీపారాధనలో పాల్గొన్నారు. క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో భక్తులే దర్శనమిచ్చారు. కొండపైన పార్కింగ్ ప్రాంతంతో పాటు కొండపై వివిధ ప్రాంతాలు వాహనాలతో రద్దీగా మారాయి.
స్వామివారి ధర్మ దర్శనానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి 2గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు.
సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామివారిని సుమారు 45వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.54,85,058 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని డీఐజీ రంగనాథ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.