సూర్యాపేట వ్యవసాయ
మార్కెట్లో శనివారం పత్తి 9,366 ధర పలికింది. రాష్ట్రంలోనే ఇదే రికార్డు స్థాయి ధర అని మార్కెట్ అధికారులు తెలిపారు. మోతె మండలం విభళాపురం గ్రామానికి చెందిన రైతు చంద్రారెడ్డి 9 క్వింటాళ్ల పత్తిని తీసుకురాగా, కమిషన్ ఏజెంట్ ఈ నామ్ పద్ధతిలో క్వింటాకు 9,366 రూపాయల చొప్పున టెండర్ వేసి తీసుకున్నారు.ఉమ్మడి జిల్లా రైతాంగం సౌలభ్యం కోసం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో మంత్రి జగదీశ్రెడ్డి తాజాగా పత్తి మార్కెట్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక్కడ కొనుగోళ్లు, తూకాలు, నగదు చెల్లింపు వంటి ప్రక్రియంతా మార్కెట్ యంత్రాంగం పర్యవేక్షణలో జరుగుతుందని, రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
-బొడ్రాయిబజార్, నవంబర్ 19
బొడ్రాయిబజార్, నవంబర్ 19 : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో పత్తికి రికార్డుస్థాయి ధర లభించింది. శనివారం మోతె మండలం విభళాపురం గ్రామానికి చెందిన రైతు చంద్రారెడ్డి 9 క్వింటాళ్ల పత్తిని మార్కెట్కు తీసుకురాగా కమీషన్ ఏజెంట్ రూ.9,366కు టెండరు వేసి కొనుగోలు చేశారు. రాష్ట్రంలోనే అత్యధిక ధర సూర్యాపేట మార్కెట్లో లభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి అత్యధిక ధర పొందిన రైతు చంద్రారెడ్డిని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎండీ ఫసియొద్దీన్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సరైన ధర అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఉమ్మడి జిల్లా రైతులకు ప్రయోజనం
ఉమ్మడి జిల్లా రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను దళారులకు విక్రయించి మోస పోకుండా ఉండేందుకు రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేటలో పత్తి మార్కెట్ను ప్రారంభించారు. ప్రస్తుతం పత్తి ఏరుతుండడంతో నిత్యం మార్కెట్కు రైతులు పత్తిని తీసుకొస్తున్నారు. పత్తి మార్కెట్లో వ్యాపారులు పోటీ పడుతూ ఆన్లైన్(ఈనామ్) ధరలు వేస్తున్నారు. నిష్ణాతులైన దడువాయిల ద్వారా ఎలక్ట్రానిక్ కాంటాలతో తూకం వేసి ఇంటిగ్రేషన్ ద్వారా కచ్చితంగా తూకాలు వేసి అదే రోజు సాయంత్రం రైతులకు కమీషన్ ఏజెంట్లు డబ్బులు చెల్లిస్తున్నారు.