ఉపాధి హామీ పనులు గుర్తించే పనిలో అధికారులు
ఉపాధి సభలు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2023-24 ఆర్థిక సంవత్సరం పని దినాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. సూర్యాపేట జిల్లాలో 475 గ్రామపంచాయతీలు, 707 ఆవాసాల్లో చేయాల్సిన పనులు, పని దినాలను అధికార యంత్రాంగం గ్రామ సభల ద్వారా నిర్ణయిస్తున్నది. ఇప్పటికే 174 పంచాయతీల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. నెలాఖరుకు నూరు శాతం చేసి జిల్లా టార్గెట్ను నిర్ణయించనున్నది. గడిచిన నాలుగేండ్లలో ఉపాధి పని దినాలు తగ్గుతూ వస్తుండగా, గతేడాది పనుల ఆధారంగా కొత్త టార్గెట్ను నిర్ణయించే అవకాశం ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే లక్ష్యాన్ని మించి పనులు చేయడం విశేషం.
-సూర్యాపేట, నవంబర్ 19
సూర్యాపేట / నూతనకల్, నవంబర్ 19 : గ్రామాల్లో పని దొరకని ప్రతి ఒక్కరికీ పని కల్పించడమే లక్ష్యంతో ప్రారంభించినదే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ పథకంలో భాగంగా 2022-23 ఆర్థిక సంవత్సరం పనిదినాలు మార్చి 31తో ముగస్తుండడంతో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను పనిదినాల గుర్తింపు ప్రక్రియను ఇప్పటికే అధికారులు ప్రారంభించారు. గ్రామాల్లో సభలు నిర్వహించి చేపట్టాల్సిన పనులు, అవసరమైన పనిదినాలను గుర్తించి గ్రామ టార్గెట్ను నిర్ణయిస్తున్నారు. అనంతరం మండల టార్గెట్, జిల్లా టార్గెట్ నిర్ణయిస్తారు.
సూర్యాపేట జిల్లాలోని 475 గ్రామ పంచాయతీల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించడానికి ఇప్ప టివరకు 174 గ్రామాల్లో సభలు పూర్తయ్యాయి. ఈనెల చివరి నాటికి గ్రామ సభలు పూర్తి చేసి, ప్రతి గ్రామంలో ప్రజల అవసరాలకనుగుణంగా దాదాపు 21 రకాల పనులను గుర్తిస్తున్నారు. జిల్లాలో 475 గ్రామపంచాయతీలు 707 ఆవాసాల పరిధిలో 2,72 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన కుటుంబాలున్నాయి. ఈ జాబ్కార్డుల్లో 6.35 లక్షల మంది సభ్యులు ఉన్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా 1.88 లక్షల జాబ్ కార్డులు మాత్రమే యాక్టివ్గా ఉండగా అందులో 3.74 లక్షల మంది సభ్యులు మాత్రమే రోజు ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు.
ఏటా తగ్గుతున్న పని దినాలు
సూర్యాపేట జిల్లాలో ప్రతి ఏటా ఉపాధి పనిదినాలు తగ్గుతు వస్తున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 67 లక్షల పనిదినాలు లక్ష్యంగా పెట్టుకోగా 2019-20 సంవత్సరంలో 55 లక్షల పనిదినాలకు తగ్గించారు. 2020-21లో కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలని 76.35 లక్షల పనిదినాలు లక్ష్యంగా పెట్టింది. 2021-22లో సైతం 74.83 లక్షల పనిదినాల లక్ష్యం కాగా 2022-23 సంవత్సరంలో 51.7 లక్షలకు తగ్గించారు.
ఈ ఏడాది టార్గెట్ పూర్తి
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా వ్యాప్తంగా 51.7 లక్షల మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. అయితే నవంబర్ 15 నాటికే లక్ష్యానికి మించి దాదాపు 59.58 లక్షల ఉపాధి పనిదినాలు కల్పించారు. అంటే 115.24 శాతం టార్గెట్ను చేరుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తికి ఇంకా నాలుగు నెలల 15 రోజులు ఉన్నది. దాంతో వ్యవసాయ పనులు పూర్తవగానే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉపాధి పనులు జోరుగా సాగనున్నాయి. ఇదే స్థాయిలో పనులు చేపడితే దాదాపు 75 లక్షల పనిదినాలు కావల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు జరిగిన పనులకు గాను మొత్తం 113.45 కోట్ల రూపాయాలు కాగా అందులో ఉపాధి కూలీలకు 87.42 కోట్లు, మెటిరియల్ కోసం 23.24 కోట్లు కేటాయించారు.
మొదటి ఎంపికకు ప్రాధాన్యం
గతంలో ఇష్టానుసారంగా పనులను గుర్తింపు ఉండేది. కూలీలు, రైతుల భాగస్వామ్యం లేకుండా ప్రజాప్రతినిధులు పనులు చేపట్టడంతో ప్రజాధనం వృథా అయ్యేది. ఈ విషయాలు సామాజిక తనిఖీల్లోనూ వెలుగుచూశాయి. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా పనుల గుర్తింపునకు గ్రామ సభలు ఏర్పాటు చేసి మెజార్టీ కూలీలు, ప్రజల అభిప్రాయాలు మేరకు గ్రామానికి అవసరమైన పనులను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ సారి పంచాయతీ గుర్తించిన మొదటి 23 పనులు పూర్తయ్యాకే మిగిలిన 23 పనులు ప్రారంభిస్తారు.
చేపట్టే పనులు ఇవే…
ఉపాధి హామీ పథకం కింద 2023-24 వార్షిక ఏడాదికి 17 విభాగాల్లో 573 రకాల పనులు చేపట్టడానికి అవకాశం ఉన్నది. కొన్ని పంచా యతీల్లో ఇప్పటికే గ్రామ సభలు మొదలయ్యాయి. చెరువులు, కుంటలు, కాల్వల్లో పూడిక తీత, కాల్వల్లో పిచ్చి మొక్కలు తొలగింపు, పొదల తొలగింపు, నీటి కుంటల నిర్మాణం, కాంటూరు కందకాల తవ్వకం, అంతర్గత మట్టిరోడ్లు వేయడం, మొక్కలు, పండ్ల తోటల పెంపకం, వంటి పనులు గుర్తిస్తే మేలు జరుగుతుంది.