యాదగిరిగుట్ట రూరల్, నవంబర్ 17 ;ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థినుల ఆరోగ్యానికి రాష్ట్ర సర్కారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. 8 నుంచి 12వ తరగతి చదివే బాలికలకు శానిటరీ హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. కొవిడ్కు ముందు ప్రతి ఒక్కరికీ హెల్త్ కిట్లను పంపిణీ చేయగా ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించనున్నది. ఈ కిట్లో ఆరు శానిటరీ న్యాప్కిన్ ప్యాక్స్, వాటర్ బాటిల్, ఒక బ్యాగ్ ఉంటుంది. త్వరలో కిట్లు రానుండగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లల్లోని 18 వేల మంది విద్యార్థినులకు ప్రయోజనం
కలుగనున్నది.
విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ కోసం చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శానిటరీ హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థినులకు 33లక్షల అడలోసెంట్ హెల్త్ కిట్ల పంపిణీకి వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. బడ్జెట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్న విధంగా అందజేసే కిట్ల కొనుగోలు, పంపిణీ కోసం
ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు.
8 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు..
అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని 8నుంచి 12వ తరగతి విద్యార్థినులకు ఈ కిట్లు అందజేయనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల కిట్లను కొనుగోలు చేయనున్నారు. ఈ కిట్లో ఆరు శానిటరీ న్యాప్కిన్ ప్యాక్స్, వాటర్ బాటిల్, ఒక బ్యాగ్ ఉంటుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం 15-24 ఏండ్ల మధ్య వయసున్న యువతుల్లో సుమారు 32 శాతం మంది న్యాప్కిన్ లాగా క్లాత్ను వినియోగిస్తున్నారు. దాంతో గర్భాశయ, మూత్రకోశ సంబంధ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇవి విద్యార్థినులు ఆరోగ్యవంతంగా ఉండేందుకు దోహదపడుతాయని, చదువుపై మరింత శ్రద్ధ చూపించేందుకు అవకాశం ఉంటుందని సర్కారు భావిస్తున్నది. తద్వారా వారి హాజరు శాతం కూడా పెరిగేందుకు దోహదపడుతుందని అంచనా వేస్తున్నది.
జిల్లాలో 18 వేల మంది బాలికలకు లబ్ధి
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో 8 నుంచి 12వ తరగతి చదువుతున్న సుమారు 18 వేల మంది విద్యార్థినులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8 నుంచి 10వ తరగతి చదువుతున్న వారు సుమారు 15 వేల మంది విద్యార్థినులు ఉన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో 10-12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులు సుమారు 3 వేల వరకు ఉన్నారు. వారందరికీ ప్రభుత్వం నుంచి వచ్చే కిట్లు అందనున్నాయి.
ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే అందజేస్తాం
ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రాగానే విద్యార్థినులందరికీ హెల్త్ కిట్లు అందజేస్తాం. ఈ కిట్కు అర్హులైనవారు జిల్లాలో ఎంత మంది ఉన్నారో గుర్తిస్తాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారందరికీ అందిస్తాం.
– కె.నారాయణరెడ్డి, డీఈఓ, యాదాద్రి భువనగిరి జిల్లా