తిప్పర్తి, ఫిబ్రవరి 13 : సీఎం కేసీఆర్ పల్లెప్రగతి పేరిట నెలనెలా కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామాలకు వెలుగులు నింపుతుండడంతో ప్రజలు తాము చెల్లించాల్సిన పన్నులు సకాలంలో చెల్లిస్తున్నారు. ఈ క్రమంలోనే మండలంలోని రామలింగాలగూడెం గ్రామ పంచాయతీ ప్రజలు వంద శాతం పన్నులు చెల్లించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ గ్రామం గతంలో జంగారెడ్డిగూడెం పంచాయతీ పరిధిలో ఆవాసంగా ఉండడంతో ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. గ్రామంలో మొత్తం 230 కుటుంబాలు ఉండగా సుమారు 1100 జనాభా కలిగి 650 మంది ఓటర్లు ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటులో భాగంగా చర్లగూడెం, కొర్వినేనిగూడెం కలిపి రామలింగాలగూడేన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది. అనంతరం ప్రభుత్వం ఇస్తున్న నిధులతో పాటు ఆదాయాన్ని సమకూర్చుకుంటూ అభివృద్థి పథంలో పయనిస్తున్నది. గ్రామంలో ఇప్పటి వరకు రూ. 80 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, వైకుంఠధామం, డంపింగ్ యార్డు నిర్మించారు. తాగు నీరు నిరంతరం సరఫరా చేస్తున్నారు. గ్రామంలో వంద శాతం పన్నులు వసూ లు కావడంతో మొత్తం రూ.80 వేలకు పైగా సంవత్సరానికి పంచాయతీకి ఆదాయం సమకూరింది.
నూటికి నూరు శాతం పన్నులు వసూలు
గ్రామస్తులు, పాలకవర్గం సహకారంతో గ్రామంలో నూటికి నూరు శాతం ఇంటి పన్నులు వసూలు చేశాం. వీటితో పాటు ప్రతిరోజు గ్రామంలో తాగునీటి సరఫరా చేస్తున్నాం. మురుగు కాల్వలను ఎప్పటి కప్పుడు శుభ్రం చేస్తున్నాం, వీధి దీపాలు చేశాం.
– సుమలత, పంచాయతీ కార్యదర్శి
ప్రభుత్వ నిధులతో అభివృద్ధ్ది చేస్తున్నాం
ప్రభుత్వం ఇస్తున్న నిధులతో గ్రామాన్ని అభివృద్ధ్ది చేస్తున్నాం. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సహకారంతో నిధులు మంజూరు కావడంతో సీసీ రోడ్లు, వైకుంఠధామం, డంపింగ్ యార్డు నిర్మాణం చేపట్టాం. వీటితో పాటు గ్రామంలో కూడా ఆదాయాన్ని కొంత మేర సమకూర్చుకుంటున్నాం.
– ముత్తినేని శ్రీదేవీశ్యాంసుందర్, సర్పంచ్, రామలింగాలగూడెం