బీబీనగర్, నవంబర్ 9 : ఆరోగ్య వ్యవస్థ మరింత బలోపేతం కావాలని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా అన్నారు. గురువారం మండలంలోని బీబీనగర్ ఎయిమ్స్లో ఆరోగ్య వ్యవస్థ బలోపేతంపై ఎకో ఇండియా సంస్థతోపాటు వివిధ రాష్ర్టాలకు చెందిన హెల్త్కేర్ అధికారులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమాన్ని భాటియా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ వైద్య సిబ్బందికి చికిత్సలో కావాల్సిన పురోగతిని మార్గదర్శకాలతో అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఎకో ఇండియా సంస్థ సహకారంతో ఎయిమ్స్లో టెలీ మానిటరింగ్ హబ్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. జీఎస్ నవీన్కుమార్, సెక్రటరీ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్ణమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతూ కొవిడ్-19 ఫలితంగా డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
భవిష్యత్తులో ఆరోగ్య రక్షణలో అత్యవసర పరిస్థితి ఏర్పడితే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కో ఇండియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సందీప్ మాట్లాడుతూ వినూత్న సాధనాలు, సాంకేతికతతో నిరంతరం నేర్చుకోవడం ద్వారా ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నిమగ్నం చేయడం ముఖ్యమని తెలిపారు. ఎలాంటి అత్యవసర స్థితి ఏర్పడిన వారు సమర్థంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారన్నారు. జి.శ్రీనివాస్రావు, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డాక్టర్ కుముద్రాయ్, చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ ఎకో ఇండియా, డాక్టర్ సందీప్ బల్లా, పీఆర్ఓ శ్యామల పాల్గొన్నారు.