మిర్యాలగూడ, నవంబర్ 9 : గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించేందుకు పోడు భూముల విచారణ గురువారం నుంచి చేపట్టనున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి సంస్థ అధికారి రాజ్కుమార్ తెలిపారు. మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ పరిధిలోని పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏండ్ల తరబడిగా అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 55,702 ఎకరాల పోడు భూముల క్రమబద్ధ్దీకరణకు 20,466 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.
నిబంధనల ప్రకారం అటవీ భూమిపై 2005 డిసెంబర్ 31 నాటికి కబ్జాల్లో ఉన్నవారిని అర్హులుగా గుర్తించనున్నట్లు చెప్పారు. ఇందు కోసం రెవెన్యూ అటవీ, పంచాయతీరాజ్ ఉద్యోగులు బృందంగా ఏర్పడి దరఖాస్తుదారుల ఇండ్ల వద్దకు వెళ్లి విచారించి సేకరించిన ఆధారాలు వివరాలను యాప్లో నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ సభ ఆమోదం అనంతరం డివిజన్, జిల్లా కమిటీలు స్క్రూట్నీ చేసి అర్హులకు హక్కు పత్రాలు జారీ చేస్తారని వివరించారు.ఈ సమావేశంలో డీఈఏ రాధ, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఎంవీజేకే మూర్తి, మసూద్షరీఫ్ ఉన్నారు.