హాలియా, ఫిబ్రవరి 10 : ఈ ఏడాది జిల్లాలో ఆరుతడిపంటల సాగు విస్తీర్ణం పెరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి అన్నారు. గురువారం అనుముల మండలం తిమ్మాపురం గ్రామం లో సాగు చేసిన వరి, వేరుశనగ పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం హాలియాలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతేడాది యాసంగిలో 4.68 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు 4.13 లక్షల ఎకరాల్లో సాగు చేశారన్నారు. గతేడాది జిల్లాలో 18వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగైతే ఈ సారి సాగు విస్తీర్ణం 50వేల ఎకరాలకు పెరిగిందన్నారు. వాతావరణంలోని మార్పులు, చలి తీవ్రత, పోషకాలలోపం వల్ల అక్కడక్కడ వరికి అగ్గి తెగులు, కాండం తొలుచు పురుగుల తీవ్రత ఉన్నట్లు చెప్పారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలతో నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం మార్కెట్లోకి నానో యూరియా వచ్చిందని, ద్రవరూపంలో ఉండే యూరియాను పిచికారీ చేయవచ్చని అన్నారు. నీరు ఎక్కువగా నిల్వ ఉండే, జాలువారే పొలాలకు నానో యూరియా ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ఎకరానికి అర లీటర్ చొప్పున నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చన్నారు. ప్రస్తుతం జిల్లాలో 2,685 పంట కల్లాలు నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో ఏడీఏ రవీందర్, ఏఓ సంతోషి, జిల్లా వ్యవసాయ టెక్నికల్ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.