యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) :‘రాజగోపాల్రెడ్డిది అహంకారం, మునుగోడు ప్రజలది ఆత్మగౌరవ పోరాటం.. రాజగోపాల్రెడ్డి గెలిస్తే పైసా పని జరుగదు. కూసుకుంట్లను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది.. ఎన్నికల్లో మోసపోతే గోసపడుతాం.. డబ్బు మదంతో విర్రవీగుతున్న రాజగోపాల్రెడ్డికి ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మర్రిగూడలో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ కూసుకుంట్లను గెలిపిస్తే మూడు నెలలకోసారి మర్రిగూడకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. రాజగోపాల్రెడ్డి మూడు వేల రూపాయల పింఛన్ ఇప్పిస్తానని ఝాటా మాటలు మాట్లాడుతున్నారని, ప్రధాని మోదీ సొంత రా్రష్ట్రం గుజరాత్లో పింఛన్ ఆరు వందల రూపాయలు దాటలేదని విమర్శించారు. గత ఎన్నికల్లో గెలిపిస్తే ఒక్క కొబ్బరికాయతో వంద పనులు చేస్తానని గొప్పలు చెప్పారని, నాలుగేండ్లలో ఒక్క రోజు కూడా సమయం దొరకలేదా అని ప్రశ్నించారు. రోడ్షోకు బతుకమ్మలు, బోనాలతో మహిళలు స్వాగతం పలికారు. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం శ్రేణులతోపాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో మర్రిగూడ జన సంద్రమైంది. ఆ జన సందోహాన్ని చూసి.. ‘డౌటే లేదు. మిమ్మల్ని చూస్తే కూసుకుంట్ల గెలుపు ఖాయమని అర్థమైతున్నది’ అంటూ
మంత్రి హరీశ్ హర్షం వ్యక్తం చేశారు.
‘టీఆర్ఎస్ కూసుకుంట్ల గెలుపు మునుగోడుకు మలుపు. మోసపోతే గోసపడుతాం. రాజగోపాల్రెడ్డిది అహంకారం.. మునుగోడు ప్రజలది ఆత్మగౌరవ పోరాటం. డబ్బు ఉందనే అహంకారంతో రాజగోపాల్రెడ్డి విర్రవీగుతున్నాడు. ఆయన అహంకారం దించాలంటే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మర్రిగూడలో మంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి రోడ్షో నిర్వహించారు. ఈ మంత్రి స్థానిక మహిళలు బోనాలు, బతుకమ్మలు, కోలాటం ఆటపాటలతో ఘన స్వాగతం పలికారు. నుదుట కుంకుమ దిద్ది హారతి పట్టారు. డప్పు కళాకారుల డప్పుల దరువులు, బ్యాండ్ వాయిద్యాలు, పటాకుల మెరుపులు, యువకుల కేరింతల నడుమ వట్టిపల్లి చౌరస్తా నుంచి మర్రిగూడ బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం జరిగిన సభలో మంత్రి ప్రసంగిస్తూ రాజగోపాల్రెడ్డి గెలిస్తే పైసా పని జరుగదని, కూసుకుంట్లను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలవుతాయని చెప్పారు. కూసుకుంట్ల గెలుపు మునుగోడుకు మలుపు అన్నారు.
మునుగోడులో గెలిపిస్తే మూడు వేల పింఛన్ ఇప్పిస్తానని రాజగోపాల్రెడ్డి మోసపు మాటలు మాట్లాడుతున్నాడని, ప్రధాని మోదీ సొంత రా్రష్ట్రం గుజరాత్లో ఆరు వందలు దాటలేదని విమర్శించారు. రాజగోపాల్రెడ్డిని ఐదేండ్ల కోసం ఎన్నుకుంటే నాలుగేండ్లకే రాజీనామా చేసి.. రూ.18వేల కోట్ల కాంట్రాక్టులకు అమ్ముడుపోయాడని, అందువల్లే మునుగోడుకు ఉప ఎన్నికలు వచ్చాయని మండిపడ్డారు. ఆయన ఇప్పుడు గెలిచినా చేసేదేమీ లేదని, మళ్లీ కాంట్రాక్టులకు అమ్ముడుపోతాడని అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం రాజీనామా చేశారని విమర్శించారు. గెలిపిస్తే ఒక్క కొబ్బరికాయతో వంద పనులు చేస్తానని గొప్పలు చెప్తున్న ఆయన.. నాలుగేండ్లలో ఒక్క రోజు కూడా సమయం దొరక లేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గం జనం సమస్యలు పట్టించుకోని రాజగోపాల్రెడ్డి ఏ ముఖం పెట్టుకొని తిరుగుతాడని మండిపడ్డారు.
గతంలో కాంగ్రెస్ పాలకులు మునుగోడును పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చి ఫ్లోరైడ్ను రూపుమాపారని తెలిపారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని.. తాగు, సాగునీరు రాకపోయేదని అన్నారు. గతంలో ప్రధాని వాజ్పేయి ముందు ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామిని పడుకోబెట్టి గోడు చెప్పుకొన్నా కనికరం లేకుండా వదిలేశారని గుర్తుచేశారు. పోరాడి తెలంగాణ తెస్తే.. కేంద్ర ఏడు మండలాలను ఏపీలో కలిపిందని విమర్శించారు. కృష్ణా జలాల వాటా తేలితే ఈ ప్రాంతానికి, జిల్లాకు నికర జలాలు కేటాయించే అవకాశం ఉండదేని, కానీ.. కృష్ణా జలాలు ఇవ్వకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో తనపై మూడు వందల కేసులు నమోదయ్యాయని, అప్పుడు బండి సంజయ్, బీజేపీ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. నాటి బీజేపీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి రాజీనామా చేయకుండా పారిపోయారని విమర్శించారు. బీజేపీ నేతలకు ఓట్లు, అధికార యావ తప్ప ప్రజల సంక్షేమం పట్టదన్నారు. వారివి ఝూటా మాటలని విమర్శించారు. నాడు కేసీఆర్ ఎంపీగా రాజీనామా చేస్తే.. ఇల్లంతకుంటలో ఇన్చార్జిగా ఉండి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినా వెన్ను చూపకుండా ఉద్యమం చేసిన నాయకుడు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయని చెప్పారు. కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, ఒడితల సతీశ్కుమార్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, సీపీఐ మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో మంది చేరిక
రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 40 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ యువ కార్యకర్తలు మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సర్పంచ్ ఎం.సుధాకర్రావు, నాయకులు రావు, మహేందర్, నరసింహ పాల్గొన్నారు.
ఆ 18వేల కోట్లివ్వండి.. ఎన్నికల నుంచి తప్పుకొంటాం
‘రాజగోపాల్రెడ్డి 18వేల కోట్లకు అమ్ముడుపోయాడు. అందులో నుంచే ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేస్తున్నాడు. ఆ డబ్బు జిల్లాకు ఇస్తే ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకొంటాం. కేసీఆర్ పథకాలను యావత్ దేశం కోరుకుంటున్నది. అందుకే మోదీకి భయం పట్టుకుంది. తాను అమలు చేయలేని పథకాలు ఎవరూ చేయకూడదని మోదీ కుట్ర పన్నారు. అందులో భాగంగానే మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారు’